చంద్రబాబుకు సెక్యూరిటీ తగ్గించారా? స్పందించిన డీజీపీ

Update: 2019-06-18 17:33 GMT
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు సెక్యూరిటీ అంశంపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. ఆయనకు సెక్యూరిటీ తగ్గించినట్టుగా జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబుకు యథారీతిన భద్రతా ఏర్పాట్లు ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు.

ఇటీవల ఎయిర్ పోర్టులో చంద్రబాబు నాయుడును తనిఖీ చేయడంపై ఆయన అభిమానులు, తెలుగుదేశం నేతలు తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. అయితే అది తమ పరిధిలోని అంశం కాదని, ఎయిర్ పోర్టుల్లో తనిఖీ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో స్పష్టం చేసింది. మాజీ ముఖ్యమంత్రులకు సెక్యూరిటీ చెక్ నుంచి మినహాయింపు ఉంటే చంద్రబాబుకు మినహాయింపు లభిస్తుంది, లేకపోతే లేదు.. అని అలా అసెంబ్లీలో జగన్ ప్రభుత్వం కుండబద్ధలు  కొట్టింది.

ఇక చంద్రబాబు నాయుడుకు వ్యక్తిగత భద్రతా సిబ్బందిని తొలగించినట్టుగా వచ్చిన వార్తలను మాత్రం ఏపీ డీజీపీ ఖండించారు. అలాంటిది ఏమీ లేదని స్పష్టం చేశారు. ఇక రాష్ట్రంలో రాజకీయ పార్టీల కార్యకర్తల మధ్యన సాగుతున్న దాడులు, ప్రతిదాడుల గురించి కూడా ఆయన స్పందించారు. అవి మరీ ఏమీ తీవ్రమైనవి కావని, వాటిని శాంతిభద్రతలకు విఘాతం కలిగించే సంఘటనలుగా భావించలేమని గౌతమ్ సవాంగ్ తెలిపారు. పోలిస్ వ్యవస్థను ప్రక్షాళన చేయలని ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నారని ఏపీ డీజీపీ అన్నారు.


Tags:    

Similar News