బీజేపీ ఎంపీ గంభీర్ తో ఆటాడుకున్న నెటిజన్లు!

Update: 2019-11-18 16:25 GMT
భారతీయ జనతా పార్టీ ఎంపీ గౌతమ్ గంభీర్ ను నెటిజన్లు ఒక ఆట ఆడుకున్నారు. దానికంతా కారణం అతడి వ్యాఖ్యలే. రెండు  వేల పదకొండు ప్రపంచకప్ ఫైనల్ లో తను తొంభై ఏడు పరుగులకు ఔట్ కావడం పై గంభీర్ రియాక్ట్ అయ్యాడు. ఆ ప్రపంచకప్ ఫైనల్లో గంభీర్ ది అత్యంత కీలకమైన ఇన్నింగ్సే.

శ్రీలంకపై భారత్ విజయం సాధించి, ప్రపంచకప్ విజేతగా నిలవడంతో గంభీర్ ఆట అత్యంత కీలకమైనది. గంభీర్ ను ఆ విషయంలో ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. అందులో అనుమానం లేదు.
అయితే ఆ ఇన్నింగ్స్ గురించి గంభీర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు మాత్రం ఫ్యాన్స్ నుంచినే అసహనాన్ని పుట్టించాయి. అందుకు ముఖ్య కారణం.. ధోనీని గంభీర్ ఇన్ డైరెక్టుగా నిందించడమే!.

తను తొంభై ఏడు పరుగుల వద్ద ఉన్నప్పుడు ధోనీ తనను డైవర్ట్ చేసినట్టుగా గంభీర్ చెప్పుకొచ్చాడు. తను ఎన్ని పరుగులు చేసిన విషయం తనకు గుర్తే లేదని, ధోనీ తన  దగ్గరకు వచ్చి 'మరో మూడు పరుగులు చేస్తే సెంచరీ పూర్తి చేస్తావు..' అంటూ అన్నాడని, దీంతోనే తను డైవర్ట్ అయినట్టుగా గంభీర్ చెప్పుకొచ్చాడు.

అంత వరకూ తను ఏకాగ్రతతో ఆడినట్టుగా - ధోనీ వచ్చి సెంచరీ గురించి చెప్పి - తన ఏకాగ్రతను దెబ్బతీశాడని - దీంతోనే తను ఔట్ అయినట్టుగా గంభీర్ చెప్పుకొచ్చాడు. దీనిపై నెటిజన్లు మండిపడుతూ ఉన్నారు.
ఆ విషయంలో ధోనీని నిందిచడం ఏమటని - ఎవరో ఏదో చెబితే డైవర్ట్ అయ్యేంత స్థాయిదా నీ ఏకాగ్రత అంటూ గంభీర్ ను దులిపేస్తున్నారు నెటిజన్లు. 'నువ్వు మంచి ఇన్నింగ్సే ఆడావు… కానీ ఇలాంటి మాటలు బాగాలేవు..' అని మరి కొందరు హితవు పలికారు!
Tags:    

Similar News