ఈ పాపం ఎవరిది? ఆరుగురు కరోనా రోగులు అగ్నికి ఆహుతి

Update: 2020-11-27 05:15 GMT
ఏ పాపం తెలియని కరోనా వ్యాధిగ్రస్థులు అగ్నికి ఆహుతయ్యారు. ఐసీయూలో చికిత్సపొందుతున్న ఆ రోగులను అగ్నికీలలు బలితీసుకున్నాయి. ప్రమాదం ఎలా జరిగిందో? మంటలు ఎలా వ్యాపించాయో అధికారులకు అంతుచిక్కడం లేదు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతున్నది. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడంతో కొంతమంది ప్రాణాలను కాపాడుకోగలిగామని అధికారులు చెబుతున్నారు. గుజరాత్​ రాష్ట్రంలోని రాజ్ కోట్ నగరంలోని ఉదయ్‌ శివానంద్ ఆసుపత్రిలోని ఐసీయూలో శుక్రవారం తెల్లవారుజామున ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. నిద్రిస్తున్న కరోనా రోగులు ఏం ఏంజరిగిందో తెలుసుకునేలోపే కన్నుమూశారు.

 షార్ట్​సర్క్యూట్​ వల్ల ప్రమాదం జరిగిందా.. మరేదైనా కారణమా.. ఇప్పటి వరకు తెలియదు. ఇప్పటి వరకు ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. మరికొందరికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో ఐసీయూలో మొత్తం పదకొండు మంది రోగులున్నట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. వారిలో ఆరుగురు చనిపోగా, మరికొందరు గాయపడ్డారు. ఒక్కసారిగా మంటలు చెలరేగంతో మిగతా వార్డుల్లో ఉన్న పేషెంట్లు బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటివరకు ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.

గతంలోనూ కోవిడ్​ ఆస్పత్రిలో ఇటువంటి ప్రమాదం జరిగింది. ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడలో స్వర్ణప్యాలెస్​ లో నిర్వహిస్తున్న కోవిడ్​ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగి 12 మంది ప్రాణాలు కోల్పోయారు. కోవిడ్​ ఆస్పత్రుల్లో , కొన్ని ప్రైవేట్​ క్వారంటైన్ సెంటర్లలో అగ్నిప్రమాదాల నివారణకు సరైన జాగ్రత్తలు తీసుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రైవేట్​ ఆస్పత్రులు కరోనా నేపథ్యంలో భారీ అక్రమాలకు పాల్పడ్డాయి. పేషెంట్ల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశాయి. కొన్నచోట్ల మృతదేహాలను అప్పగించేందుకు కూడా లక్షల రూపాయలు వసూలు చేశారు.
Tags:    

Similar News