తీగల వంతెనపై అతి తెలివి చూపొద్దు.. అడ్డంగా బుక్కైపోతారు..

Update: 2020-10-23 02:45 GMT
హైదరాబాద్​ నగరంలోని దుర్గం చెరువుపై నిర్మించిన తీగల వంతెన హైదరాబాద్​కే తలమానికంగా మారింది. ఈ నిర్మాణాన్ని తిలకించేందుకు సీటీ నలుమూలల నుంచే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి  కూడా పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు. కేవలం శుక్రవారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు అక్కడ సందర్శకులకు అనుమతి ఉంటుంది. మిగతా రోజులు మామూలుగా వాహనాల్లో వంతెనపై నుంచి వెళ్లొచ్చు కానీ.. ఆక్కడ పార్కింగ్​ చేయడం ఫొటోలు దిగడం నిషేధం. ఒక వేళ ఎవరన్న ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్కడ టూవీలర్లు, లేదా ఫోర్​ వీలర్లు పార్క్​ చేస్తే.. వెంటనే సీసీ కెమెరాల్లో రికార్డు అవుతుంది. ఈ బండి నంబర్​ ఆధారంగా మీకు ఫైన్​ పడుతుంది. దీంతో తీగల వంతెనను తిలకించేందుకు ప్రజలు అతితెలివి ప్రదర్శిస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి తన భార్య , ఇద్దరు పిల్లలతో కలిసి తీగలవంతెన చూసేందుకు వచ్చాడు. అనుమతి లేకపోవడంతో సీసీ కెమెరాలనే బురిడీ కొట్టించాలనుకొని అడ్డంగా బుక్కయ్యాడు.

ఇంతకూ ఏం జరిగిందంటే..

ఓ వ్యక్తి తన భార్య, పిల్లలతో కలిసి తీగల వంతెనపైకి వచ్చాడు. తన భార్య అడిగిందో.. లేక పిల్లలు మారాం చేశారో తెలియదు  కానీ అక్కడ తీగల వంతెనపై ఫొటోలు తీసుకోవాలనుకున్నాడు. కానీ సీసీ కెమెరాలు ఉండటం గమనించాడు.  బైక్​ అక్కడ పార్క్​ చేశాడు. సీసీ కెమెరాలను గమనించి.. బైక్‌ నెంబర్‌ ప్లేట్‌ కనిపించకుండా భార్య మెడలోని చున్నీని తీసి దానిని కవర్‌ చేశాడు. ఇది కూడా అక్కడి కెమెరాలో రికార్డు అయ్యింది. వీరి ఘనకార్యం కాస్తా పోలీసుల కంటపడడంతో అలర్ట్‌ అయ్యారు. ఇది గమనించి వారు బైక్‌ తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయినప్పటికీ జరిమానా నుంచి తప్పించుకోలేదు. ఇందుకు సంబంధించిన వీడియోను సైబరాబాద్‌ పోలీసులు షేర్​ చేశారు. ‘ఇలాంటి ఫ్యామిలీ నెవెర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్’ అంటూ క్యాప్షన్‌ పెట్టారు.  ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్​ అవుతోంది.
Tags:    

Similar News