కలసి జై కొడదాం: కూటమి పార్టీలకు బాబు పిలుపు
పార్లమెంటు ఉభయసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు చర్చకు రానున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు కూటమి పార్టీల నాయ కులతో బుధవారం సాయంత్రం భేటీ అయ్యారు;
పార్లమెంటు ఉభయసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు చర్చకు రానున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు కూటమి పార్టీల నాయ కులతో బుధవారం సాయంత్రం భేటీ అయ్యారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ ప్రత్యేక భేటీకి.. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర చీఫ్ పీవీఎన్ మాధవ్లు హాజరయ్యారు. వీరితో పాటు మంత్రి లోకేష్ సహా పలువురు ముఖ్య నాయకులు, రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కూడా ఉన్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ అనేది దేశంలో ఒక కొత్త ముందడుగని వ్యాఖ్యానించారు. దీనికి అందరూ కలిసి జై కొడదామని పిలుపునిచ్చారు. ఇప్పటికే తాను పార్టీలకు అతీతంగా అందరికీ లేఖలు రాసిన విషయాన్నిగుర్తు చేశారు. మహిళలకు రిజర్వేషన్ కల్పించడం ద్వారా.. సమాజంలోనే కాకుండా.. చట్టసభల్లోనూ వారికి భాగస్వామ్యం పెంచినట్టే నని తెలిపారు. ఈ అపూర్వ క్షణాలను అందరూ సద్వినియోగం చేసుకుందామని పేర్కొన్నారు. బిల్లుకు తరతమ బేధం లేకుండా అందరూ మద్దతు పలుకుతున్నారని పేర్కొన్నారు.
రాష్ట్రంలో సంబరాలు..
బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు నిర్వహించాలని మూడు పార్టీలు నిర్ణయించాయి. చంద్రబాబు చేసిన ఈ ప్రతిపాదనకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్కు అంగీకరించారు. రాష్ట్రంలో ఎక్కడికక్కడ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. పార్లమెంటు సభ్యుల స్థానాల్లోనే కాకుండా.. మహిళా ప్రజాప్రతినిధు లు ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఈ కార్యక్రమాలు జరగాలని సూచించారు. ప్రధాని మోడీ సహా కేంద్రంలోని మంత్రులకు ధన్యవాదాలు తెలుపుతూ.. కార్యక్రమాలు నిర్వహించాలని చంద్రబాబు సూచించారు.
వైసీపీ మాటేంటి?
ఇక, వైసీపీ విషయంపైకూడా చంద్రబాబు చర్చించారు. ఇటీవల అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును వైసీపీ వ్యతిరేకించినా .. మహిళా బిల్లుకు అనుకూలంగానే ఉంటుందని అభిప్రాయపడ్దారు. ఒకవేళ ఈ బిల్లుకు మద్దతు తెలపకపోతే.. ఆ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్దామని వ్యాఖ్యానించారు. వైసీపీ వాళ్లు మహిళలకు మద్దతు ఇచ్చే అవకాశం ఉందని బీజేపీ చీఫ్ మాధవ్ వ్యాఖ్యానించగా.. పవన్ కల్యాణ్ సైతం.. కావొచ్చని చెప్పారు.