ఏలూరులో ఆకుకూరల వ్యాపారులు లబోదిబో

Update: 2020-12-13 08:53 GMT
సుబ్బిపెళ్ళి ఎంకి చావుకొచ్చిందన్న సామెత లాగ తయారైంది ఏలూరులో వింతవ్యాధి ప్రభావం.  గడచిన వారం రోజులుగా వింతవ్యాధి ఏలూరులో జనాలను టెన్షన్ పెట్టేస్తోంది. సుమారుగా 650 మంది ఈ వ్యాధి కారణంగా ఫిట్స్ తో ఆసుపత్రిలో చేరగా మరో ముగ్గురు చనిపోయిన విషయం తెలిసిందే. వింతవ్యాధికి కారణాలు తెలీక ప్రభుత్వ వైద్యులు, ప్రిస్టేజియస్ పరిశోధనా సంస్ధలు సీసీఎంబి, ఢిల్లీ, మంళగిరి ఎయిమ్స్ లోని నిపుణులు, ఎన్ఐఎన్ లాంటి అనేక సంస్ధల నిపుణులు పరిశోధనల పేరుతో ఏలూరులోనే క్యాంపువేశారు.

తమ పరిశోధనల్లో భాగంగా వింతవ్యాదికి కారణాలని అనుమానిస్తున్న మంచినీటిని, కూరగాయలు, ఆకుకూరలు, పప్పుదినుసులు,  పాలు, నూనెల శాంపుళ్ళని కలెక్టు చేసుకున్నారు. దాంతో సమస్య ఎందులో ఉందో తెలీక స్ధానికుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. అసలు సమస్య ఎందులో ఉందో తెలీలేదు కానీ దీని ప్రభావం ఆకుకూరలు, కాయగూరలపై పడింది.

ఏలూరులో జనాలు కూరగాయలు, ఆకుకూరల కొనుగోళ్ళు బాగా తగ్గించేశారు. మరి ఆకుకూరలు పూర్తిగా కొనటం మానేసిన జనాలు కాయగూరలతోనే వంటలను నెట్టుకొచ్చేస్తున్నారట. దాని ప్రభావం ఎకరాల్లో ఆకుకూరలు పండించే రైతులు, వాటిని అమ్మే వ్యాపారస్తులపై పడింది. గడచిన వారం రోజులుగా ఆకుకూరలను కొనేవాళ్ళు లేక తమ వ్యాపారాలన్నీ దెబ్బ తినేస్తున్నాయంటూ లబోదిబోమంటున్నారు. పనిలో పనిగా డాక్టర్లు, వైద్య నిపుణులు తాము కొనుగోలు చేస్తున్న కాయగూరలను కూడా ఉప్పుతో బాగా శుభ్రంచేసుకోవాలని సూచిస్తున్నారు.
Tags:    

Similar News