ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశమే లేదు !

Update: 2021-01-01 07:37 GMT
తమిళనాడు లో ఎన్నికల సంగ్రామం మొదలైంది. మరికొద్ది రోజుల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. దీనితో రాష్ట్రలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. వ్యూహ , ప్రతి వ్యూహాలతో రాజకీయనేతలు విజయం కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అనుకున్న సమయం కంటే ముందుగానే ఎన్నికలు జరగబోతున్నాయి అంటూ వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు నిర్వహించే ఛాన్స్  లేదని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి సత్యప్రదసాహు స్పష్టం చేశారు. ఈ యేడాది ఏప్రిల్‌ లేదా మే నెలలో జరిపేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది అంటూ చెప్పారు.

తమిళనాడు సహా పుదుచ్చేరి, కేరళ, అసోం, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాలకు కూడా ఈ యేడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఐదు రాష్ట్రాలలో కొత్త ఓటర్ల జాబితా తయారీ ముమ్మరంగా జరిగాయి. జనవరి 5న తుది ఓటర్ల జాబితా విడుదల చేయనున్నారు. అదే సమయంలో ఐదు రాష్ట్రాలకు ఈవీఎంలను తరలించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు చేపడుతోందని చెప్పారు. అలాగే కరోనా లాక్‌ డౌన్‌ నిబంధనల మేరకు ప్రతి వెయ్యి మంది ఓటర్లకు ఒక పోలింగ్‌ కేంద్రం చొప్పున ఏర్పాటు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించిందన్నారు. ప్రస్తుతం వెయ్యి కంటే అధికంగా ఓటర్లు కలిగిన పోలింగ్‌ బూత్‌ ల వివరాలు సేకరిస్తున్నా మని, అవసరమైన ప్రాంతాల్లో అదనపు పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేసేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

గత ఎన్నికల్లో రాష్ట్రంలో 65 వేల పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఈసారి అసెంబ్లీ ఎన్నికలకు రాష్ట్ర వ్యాప్తంగా 95 వేల వరకు పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కేంద్రాలకు అవసరమైన ఈవీఎంలను మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి తీసుకొచ్చే చర్యలు చేపట్టామని తెలిపారు. కొత్త పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు, కేం ద్రాలకు అవసరమైన ఎన్నికల సిబ్బంది ఎంపిక, వారికి శిక్ష ణ తదితరాలు నిర్వహించాల్సి ఉన్నందువల్ల, ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు అవకాశం లేదని ఆయన స్పష్టంచేశారు.
Tags:    

Similar News