ఏపీ : ఆ సొమ్ముని డైవర్ట్ చేయకండి : సుప్రీం కోర్ట్

Update: 2022-04-14 01:02 GMT
క‌రోనాతో మృతి చెందిన వారి కుటుంబాల‌ను ఆదుకునేందుకు కేంద్ర ప్ర‌బుత్వం ఒక్కొక్క కుటుంబానికి రూ.50 వేల చొప్పున సాయం చేసింది. ఇది కూడా సుప్రీంకోర్టు ఆదేశాల మేర‌కు జ‌రిగిందే. అయితే.. ఏపీలో ఇలా మృతి చెందిన వారి కుటుంబాల కోసం.. ఇచ్చిన సొమ్మును(ఎంత ఇచ్చారో తెలియాల్సి ఉంది) రాష్ట్రంలోని జ‌గ‌న్ ప్ర‌భుత్వం సొంత ఖ‌ర్చుల‌కు కేటాయించుకుంది. దీనిపై సుప్రీం కోర్టు తీవ్ర‌స్థాయిలో మండిప‌డింది.

విపత్తు చట్టం నిబంధనలను రాష్ట్రం ఉల్లంఘించిందని.. వైసీపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలకు సాయం విషయంలో రాష్ట్ర సర్కారు తీరును తప్పుబట్టింది. రాష్ట్ర విపత్తు నిధులు పీడీ ఖాతాలకు మళ్లించవద్దని ఆదేశించింది. కరోనాతో మృతిచెందిన వారి కుటుంబాలకు సాయం విషయంలో జ‌గ‌న్‌ సర్కారు విధానం స‌రిగా లేద‌ని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేర‌కు న్యాయ‌మూర్తులు జస్టిస్‌ ఎం.ఆర్.షా, జస్టిస్‌ బీవీ. నాగరత్నతో కూడిన ధర్మాసనం ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

విపత్తు సహాయ నిధులను పర్సనల్‌ అకౌంట్ల డిపాజిట్‌ కింద బదిలీ చేశారని..పిటిషనర్‌ సుప్రీంకోర్టు దృష్టికి  తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన సుప్రీం ధర్మాసనం.. విపత్తు నిర్వహణ నిధులను పర్సనల్‌ డిపాజిట్‌ అకౌంట్లకు బదిలీ చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై ఈ నెల 28 లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఇప్పటికే నిధులు బదిలీ చేసి ఉంటే.. ఇతర ఏ అవసరాలకూ వినియోగించవద్దని స్పష్టం చేసింది.

విపత్తు ప్రతిస్పందన నిధుల మళ్లింపుతో విపత్తు నిర్వహణ చట్ట నిబంధనలు ఉల్లంఘించినట్లు నిర్ధరణకు వచ్చామని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. కరోనా సమయంలో మరణించిన వారి కుటుంబాలకు ఆర్థిక సహకారం అందించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలంటూ.. న్యాయవాది గౌరవ్‌ భన్సల్‌ గతంలో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా రాష్ట్రాల్లో పరిస్థితులు, ఆర్థిక సహకారం పంపిణీపై నివేదికలను సుప్రీంకోర్టు పరిశీలించింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో విపత్తు నిర్వహణ నిధులు దారిమళ్లినట్లు న్యాయవాది గౌరవ్‌ బన్సల్‌ ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు.
Tags:    

Similar News