అయ్యో.. నారాయణ ఫిర్యాదుకు ప్రయోజనం దక్కలే..!

Update: 2015-06-30 06:07 GMT
పార్టీ ఫిరాయింపులు.. గోడ దూకుడు వ్యవహారాలను సహించలేక కమ్యూనిస్టు నారాయణ అసహనంతో కోర్టుకు ఎక్కినా ప్రయోజనం దక్కలేదు. ఫిరాయింపులకు పాల్పడింది తమ పార్టీ వారు కాకపోయినా.. ఈ ఫిరాయింపులు ప్రజాస్వామ్య విలువను పాతరేస్తున్నాయన్న అభిప్రాయంతో ఆయన వేసిన పిల్‌ విచారణకే రాలేదు. కోర్టు దీన్ని విచారణకే స్వీకరించకుండా తిరస్కరించింది. పిల్‌ విచారణార్హం కాదని స్పష్టం చేసింది.

    తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ప్రజాప్రతినిధుల ఫిరాయింపులపై చర్యలు తీసుకోవాలని.. ఈ అంశంపై విచారణ జరపాలని.. అలాగే ఎన్నికల అక్రమాలపై విచారణ జరపాలని కోరుతూ సీపీఐ నారాయణ పిల్‌ను దాఖలు చేశాడు. ఈ మధ్యకాలంలో జరుగుతున్న ఫిరాయింపు పరిణామాలను సహించలేకే తను ఈ పిల్‌ను దాఖలు చేశానని నారాయణ మీడియాకు కూడా వివరించాడు.

    ఇప్పటికే కాంగ్రెస్‌, తెలుగుదేశం, వైఎస్సార్‌కాంగ్రెస్‌ వంటి పార్టీలు తమ పార్టీ నుంచి ప్రజాప్రతినిధులు బయటకు పోవడంపై కోర్టుకు ఎక్కాయి. అయితే ఇలాంటి ఫిరాయింపు దారుల జాబితాలో సీపీఐ తరపు ప్రజాప్రతినిధులు ఎవరూ లేరు. అయినా కూడా నారాయణ వెళ్లి పిల్‌ దాఖలు చేశాడు.

    మరి దీని పై అయినా కోర్టులో విచారణ జరుగుతుంది.. ఫిరాయింపు రాజకీయాలపై ఏవైనా చర్యలు ఉంటాయి.. అనే అంశంపై చాలా మంది ఆశలు పెట్టుకొన్నారు. అయితే పిల్‌ పూర్తి స్థాయి వివరాలతో లేదని.. తగిన వివరాలతో మరోసారి దాఖలు చేయాలని వ్యాఖ్యానిస్తూ కోర్టు నారాయణ పిటిషన్‌ను తిరస్కరించింది. మరి దీనిపై ఎర్రన్న ఏ విధంగా స్పందిస్తాడో!

Tags:    

Similar News