బాబుకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్త బ‌స్సుయాత్ర‌

Update: 2017-01-17 06:43 GMT
ఏపీ ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు ప్రజా వ్యతిరేక పరిపాలనను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ తెలిపారు. రాష్ట్రంలోని ఎస్సీ - ఎస్టీ - బీసీ - మైనార్టీ వర్గాల ప్రజలు తీవ్ర అణిచివేతకు గురవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 'ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి- సామాజిక న్యాయం' ఎజెండాగా ఈ నెల 26 నుంచి 40 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా 'ప్రజా చైతన్య బస్సుయాత్ర' నిర్వహిస్తామని రామ‌కృష్ణ‌ ప్రకటించారు. ఇచ్ఛాపురంలో ప్రారంభమై 13 జిల్లాల్లోని 175 నియోజకవర్గాల గుండా ఈ యాత్ర సాగి హిందూపురంలో ముగుస్తుందని వివరించారు. అణిచివేతకు గురవుతున్న పేదల కోసం దీర్ఘకాలిక ఉద్యమం చేపడుతున్నామని హైదరాబాద్‌ లో  ఆయన వివరించారు.

ప్ర‌జా సంక్షేమం కాంక్షిస్తూ తాము చేప‌ట్టిన ఈ యాత్రలో అంబేద్కర్‌ మనవడు ప్రకాశ్‌ అంబేద్కర్‌ -  సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి - సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు - జ‌న‌తాద‌ళ్ నేత‌ శరద్‌ యాదవ్‌ వంటి ప్రముఖులు పాల్గొంటారని రామ‌కృష్ణ‌ తెలిపారు. అమరావతిని ఫ్రీజోన్‌ గా ఉంచాలని,  ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లను అమలు చేయాలని, చేతివృత్తులను పరిరక్షించాలని డిమాండ్‌ చేశారు. రెండున్నరేళ్లలో 430 సంక్షేమ హాస్టళ్లను మూసివేశారని తెలిపారు.  సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు ఒక్కొక్కరికి ప్రతీ నెల రూ, 2 వేల నుంచి రూ, 4 వేల వరకూ కేటాయించాలని కోరారు. సింగపూర్‌ తరహా అంటూ చంద్రబాబు పాలనంతా రాజధాని అమరావతి చుట్టూనే తిప్పుతున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వియ్యంకులైన‌ పుర‌పాల‌క శాఖా మంత్రి పి.నారాయణ, విద్యాశాఖా మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావుకు విద్యను వదిలిపెట్టారని రామ‌కృష్ణ ఆరోపించారు. ప్రభుత్వ ఆసుపత్రులను ప్రైవేటు యాజమాన్యాలకు అప్పగిస్తున్నారన్నారు. ఇలాంటి ప్రభుత్వం దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్‌ లోనే ఉందని దుయ్య‌బ‌ట్టారు. సబ్‌ ప్లాన్‌ నిధులను పక్కదారి పట్టిస్తున్నారని, బీసీలకు కేటాయించిన నిధుల్లో కేవలం 10 శాతమే ఖర్చు చేశారని రామ‌కృష్ణ పేర్కొన్నారు. ప్ర‌జానికం ఎదుర్కొంటున్న ఇలాంటి స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకే తాము యాత్ర చేపడుతున్న‌ట్లు రామ‌కృష్ణ వివ‌రించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News