జ‌గ‌న్‌కు కార్పొరేట‌ర్ల షాక్‌

Update: 2021-12-31 02:30 GMT
ఓ వైపు సంక్షేమ ప‌థ‌కాల పేరుతో ప్ర‌జ‌ల ఖాతాల్లో నేరుగా డ‌బ్బులు వేస్తూ పాల‌న‌లో ముందుకు సాగుతున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం జ‌గ‌న్‌.. మ‌రోవైపు అభివృద్ధి ప‌నుల కోసం నిధులు లేవంటూ గ‌గ్గోలు పెడుతూ ఆందోళ‌న చేస్తున్న ఆ పార్టీ ప్ర‌జా ప్ర‌తినిధులు.. ఇదీ ఇప్పుడు ఏపీలో ప‌రిస్థితి.

రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి దిగ‌జారుతున్న‌ప్ప‌టికీ సంక్షేమ ప‌థ‌కాల‌ను మాత్రం కొన‌సాగిస్తున్న జ‌గ‌న్ అందుకు అప్పులు చేస్తూనే ఉన్నార‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. కానీ రాష్ట్రంలో అభివృద్ధిని మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని విప‌క్షాల‌తో పాటు సొంత పార్టీ నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం.

సంక్షేమ ప‌థ‌కాల‌ను ప‌క్కాగా అమ‌లు చేయ‌డంలో జ‌గ‌న్ మునిగిపోయారు. దీంతో మిగ‌తా కార్య‌క‌లాపాల గురించి పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. తాజాగా క‌ర్నూలు కార్పొరేష‌న్‌లో సొంత పార్టీ కార్పొరేట‌ర్లే ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా మాట్ల‌డ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

మున్సిపాలిటీ, కార్పొరేష‌న్ల‌లో నిధుల కొర‌త‌తో చిన్న‌పాటి రోడ్డు కూడా వేసే ప‌రిస్థితులు లేవ‌ని ఈ విష‌యాన్ని వైసీపీ కార్పొరేట‌ర్లే ప్ర‌స్తావించ‌డం ప‌రిస్థితికి అద్దం ప‌డుతోంది. క‌ర్నూలు కార్పొరేష‌న్‌లో క‌నీసం ఒక్క ప‌ని జ‌ర‌గ‌డం లేద‌ని ప్ర‌జ‌ల‌కు ముఖం చూపించ‌లేక‌పోతున్నామ‌ని అధికార పార్టీ కార్పొరేట‌ర్లు ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

క‌ర్నూలు న‌గ‌ర‌పాల‌క సంస్థ స‌ర్వ‌స‌భ్య స‌మావేశంలో వైసీపీ కార్పొరేట‌ర్లు త‌మ ఆవేద‌న వెళ్ల‌గ‌క్కారు. అధికార పార్టీకి చెందిన 43వ డివిజ‌న్ కార్పొరేట‌ర్ మునెమ్మ ఏకంగా కౌన్సిల్ హాల్లో బైఠాయించి నిర‌స‌న వ్య‌క్తం చేశారు. త‌న డివిజ‌న్‌కు ఇప్ప‌టివ‌ర‌కూ నిధులు కేటాయించ‌లేద‌ని ఆమె ఆందోళ‌న చేశారు.

దీంతో మేయ‌ర్ బీవై రామ‌య్య‌తో పాటు ఎమ్మెల్యేలు కాట‌సాని రాంభూపాల్ రెడ్డి, సుధాక‌ర్ ఆమెకు న‌చ్చజెప్పి ఆందోళ‌న విర‌మింపజేయాల్సి వ‌చ్చింది. ఇక 41వ డివిజ‌న్ కార్పొరేట‌ర్ శ్వేత కూడా చిన్న చిన్న స‌మస్య‌లూ ప‌రిష్కారం కావ‌డం లేద‌ని దీంతో జ‌నం నిల‌దీస్తున్నార‌ని ఆవేద‌న వ్యక్తం చేశారు.

ఇలాంటి ప‌రిస్థితి కేవ‌లం క‌ర్నూలు కార్పొరేష‌న్‌కే ప‌రిమితం కాలేద‌ని రాష్ట్రవ్యాప్తంగా ఇదే దుస్థితి ఉంద‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మిగిలిన చోట్ల కూడా అధికార కార్పొరేట‌ర్లు ప్ర‌భుత్వ తీరుపై నిర‌స‌న వ్య‌క్తం చేసే రోజులు ద‌గ్గ‌ర్లోనే ఉన్నాయ‌ని రాజ‌కీయ నిపుణులు చెబుతున్నారు. మ‌రోవైపు ఇప్ప‌టికే వైసీపీ ఎమ్మెల్యేల్లో కొంత‌మంది జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై బ‌హిరంగంగానే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.


Tags:    

Similar News