లాక్ డౌన్ ఎత్తివేత ..ఒక్కరోజే 20 వేలమందికి కరోనా !

Update: 2020-05-07 07:30 GMT
కరోనా ప్రపంచంలోని పలు దేశాలపై పంజా విసురుతుంది, ముఖ్యంగా అమెరికా లో కరోనా భాదితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే , ఈ నేపథ్యంలోనే ఆర్థిక వ్యస్థను గాడిలో పెట్టాలంటూ ట్రంప్ ...  అమెరికాలోని పలు రాష్ట్రాల్లో లాక్‌ డౌన్‌ నిబంధనలు ఎత్తివేసిన నేపథ్యంలో కరోనా వైరస్‌ ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నట్లు నిపుణులు గుర్తించారు. మంగళవారం ఒక్కరోజే దాదాపు 20 వేల కొత్త కేసులు నమోదు కాగా.. వెయ్యి మంది ప్రాణాలు కోల్పోయినట్లు జాన్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ గణాంకాలు చెబుతున్నాయి. లాక్ ‌డౌన్‌ నిబంధనలను సడలించడంతో పెరుగుతున్న ఇన్ఫెక్షన్‌ రేటును అదుపు చేయకుంటే మరిన్ని మరణాలు తప్పవని ఆరోగ్యశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఈ సారి మరణాలు వేల సంఖ్యలో ఉంటాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికాలో లాక్‌ డౌన్‌ కొనసాగుతున్న ప్రాంతాలను పరిగణలోకి తీసుకుంటే కొత్త కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ న్యూయార్క్‌ దాని పరిసర ప్రాంతాలను మినహాయించి చూస్తే ఐదు రోజుల్లో నమోదైన కేసుల సగటు ప్రతి లక్ష మందికి 6.2 నుంచి 7.5కు పెరిగినట్లు అసోసియేటెడ్‌ ప్రెస్‌ జరిపిన ఒక అధ్యయనం చెబుతోంది. న్యూయార్క్‌ లో కొన్ని రోజులుగా కరోనా‌ మరణాలు తగ్గుముఖం పట్టాయి కానీ చాలా ప్రాంతాల్లో పెరిగాయి. పరీక్షలు ఎక్కువ చేయడం వల్ల ఎక్కువ కేసులు నమోదవుతున్నాయన్న వాదన అమెరికా విషయంలో పనిచేయదని, వాస్తవంగా కేసులు ఎక్కువయ్యాయని కాలిఫోర్నియా యూనివర్సిటీ శాస్త్రవేత్త జువో ఫెంగ్‌ జాంగ్‌ తెలిపారు.

న్యూయార్క్‌ కు దూరంగా ఉన్న ప్రాంతాల్లోనూ కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. అయోవాలో మంగళవారం రికార్డు స్థాయిలో 19 మంది ప్రాణాలు కోల్పోగా టైసన్‌ ఫుడ్‌ పోర్క్‌ ప్లాంట్‌లో దాదాపు 730 మందికి వైరస్‌ సోకింది. కాన్సస్‌లోని షానీ కౌంటీలో వారం రోజులుగా కేసుల సంఖ్య రెట్టింపు అవుతోందని ఒక నివేదికలో వెల్లడైంది. లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించిన రోజు నుంచే కేసుల పెరుగుదల నమోదు కావడం ఇక్కడ గమనార్హం. భౌతిక దూరం పాటించడం వంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోతే ఆగస్టు నాటికి అమెరికా మొత్తమ్మీద కరోనా‌ కారణంగా 1.34 లక్షల మంది మరణించే అవకాశముందని వాషింగ్టన్‌ విశ్వ విద్యాలయం శాస్త్రవేత్త క్రిస్టఫర్‌ ముర్రే సిద్ధం చేసిన మోడల్‌ హెచ్చరించారు.
Tags:    

Similar News