కోదండరాంకు కాంగ్రెస్ రాంరాం.. కారణమిదేనా?

Update: 2019-08-02 11:36 GMT
కోదండరాం.. అందరూ ఉపయోగించుకొని వదిలేసిన పెద్ద మనిషి ఈయన.. నాడు తెలంగాణ ఉద్యమాన్ని ఏకతాటిపైకి తీసుకురావడానికి కేసీఆర్ ఈయనను జేఏసీ చైర్మన్ ను చేసి అందరినీ లైన్లో పెట్టారు. తెలంగాణ సాధించారు. కానీ ఆ తర్వాత పరిణామాలతో కేసీఆర్ కు కోదండరాం గ్యాప్ పెరిగింది.. శత్రువులుగా మారారు.

ఆ తర్వాత పోయిన ఎన్నికలకు ముందు టీజేఎస్ స్థాపించిన కోదండరాం.. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ మహాకూటమిలో చేరి కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కోదండరాంకు పెద్ద పదవితో కీరోల్ వహించేలానే  ఒప్పందం చేసుకున్నాడు. కానీ మహాకూటమి ఓటమితో కోదండరాం కలలు కల్లలయ్యాయి. ట్రైన్ రివర్స్ అయ్యింది..

ఇప్పుడు ప్రతిపక్ష కాంగ్రెస్ పూర్తిగా కోదండరాంను పక్కనపెట్టేసిందట.. ఎందుకంటే కోదండరాం కోరిన కోరికను నెరవేర్చమని కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేశాయట.. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో పోటీకి కోదండరాం రెడీ అయ్యారట.. ఈ మేరకు పీసీసీ చీఫ్ ను కలిసి తనకు మద్దతివ్వాలని.. తన అభ్యర్థిత్వాన్ని బలపర్చాలని పోటీపెట్టవద్దని కోరారట కానీ కోదండరాంకు మద్దతు  ఇవ్వడం సాధ్యం కాదని  పీసీసీ చీఫ్ ఉత్తమ్ చెప్పినట్టు ప్రచారం సాగుతోంది. దీంతో కాంగ్రెస్ కు పూర్తిగా దూరం జరిగారట మాస్టారు.

ఇప్పుడు కాంగ్రెస్ పార్టీయే కోదండరాంను వదిలేసిందా.? లేక కోదండరామే సీటు ఇవ్వనందుకు కాంగ్రెస్ ను వదిలేశాడో తెలియదు కానీ.. ఈ ఇద్దరి మధ్య చాలా గ్యాప్ పెరిగిందనేది మాత్రం వాస్తవమట.. ఈ మేరకు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ సాగుతోంది. తెలంగాణ యవనికపై వెలుగు వెలిగిన కోదండరాం పరిస్థితి ఇప్పుడు రెంటికి చెడ్డ రేవడిలా మారడం ఆయన అభిమానులను కలవరపెడుతోందట..

    

Tags:    

Similar News