బ్రేకింగ్: ప్రగతి భవన్ కు చేరుకున్న సీఎం కేసీఆర్!

Update: 2020-07-11 15:35 GMT
సీఎం కేసీఆర్ ఎక్కడ.? రెండు వారాలుగా ప్రతిపక్షాలు, మీడియా, నెటిజన్లు అందరూ ప్రశ్నిస్తున్న ప్రశ్న ఇదొక్కటే.. సార్ ఎక్కడ? ఏమైంది? కరోనా వైరస్ తీవ్రత వేళ కేసీఆర్ ఎక్కడికెళ్లారు? ఫాంహౌస్ కు ఎందుకు వెళ్లారు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు తెలంగాణ సమాజంలో హాట్ టాపిక్ గా మారాయి.

కొందరైతే ఏకంగా హైకోర్టుకు ఎక్కి కేసీఆర్ కనిపించడం లేదని పిటీషన్లు వేశారు. ప్రగతి భవన్ ఎదుట కొందరు ప్లకార్డులు ప్రదర్శించారు. కేసీఆర్ హైదరాబాద్ ఎప్పుడొస్తాడు? ఎప్పుడు కనిపిస్తాడు అన్నది హాట్ టాపిక్ గా మారిన వేళ సార్ వచ్చాడు అన్న కబురు అందింది.

తెలంగాణ సీఎం కేసీఆర్ ఎట్టకేలకు రెండు వారాల అజ్ఞాత వాసం అనంతరం తన ఫాం హౌస్ నుంచి హైదరాబాద్ లోని ప్రగతి భవన్ కు చేరుకున్నారు. గత రెండు వారాలుగా ఫాంహౌస్ లో ఉన్న సీఎం.. తాజాగా ప్రగతి భవన్ కు వచ్చారు.

ఆయన షెడ్యూల్ కూడా ఖరారైంది. అభివృద్ధి పనులపై, కరోనా పరిస్థితులపై సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులతో చర్చించనున్నట్టు తెలిసింది. ఇక ఒకటి రెండు రోజుల్లోనే రైతులతో సీఎం సమావేశమయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తంగా ఎట్టకేలకు రెండు వారాల తర్వాత కేసీఆర్ కంటపడడం.. హైదరాబాద్ రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడిక ఆయన ఎటువంటి స్టెప్ వేస్తారన్నది రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.
Tags:    

Similar News