చైనా అధికారిక మీడియా ట్వీట్ చేసిన వీడియో లక్ష్యం వార్నింగ్ ఇవ్వటమేనా?

Update: 2020-06-08 04:09 GMT
గడిచిన కొద్దికాలంలో భారత్ - చైనా సరిహద్దుల్లో కొత్త టెన్షన్ నెలకొన్న సంగతి తెలిసిందే. ఓవైపు రెండు దేశాల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదంపై మిలటరీ కమాండర్స్ స్థాయిలో చర్చలు జరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్న వేళలోనే.. ఊహించని పరిణామం చోటు చేసుకుంది. భారత్ ను బెదిరించే ధోరణిలో బరితెగింపు చర్యకు పాల్పడింది. భారత్ - చైనా సరిహద్దుల్లో తన సైనిక బలగాల్ని భారీ ఎత్తున మొహరించటమే కాదు.. వేలాది మంది చైనా సైనికులతో కూడిన సైనిక విన్యాసాల్ని నిర్వహిస్తోంది.

దీనికి సంబంధించిన వీడియో క్లిప్ ను చైనా అధికారిక మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్ ట్వీట్ చేసింది. రెండు నిమిషాలకు కాస్త తక్కువ నిడివి ఉన్న ఈ వీడియోలో చైనా సైనిక బలగాలు.. వారి సామర్థ్యం ఏ స్థాయిలో ఉంటుందో చూపించేలా వీడియో ఉండటం గమనార్హం. వేలాదిగా చైనా సరిహద్దుల్లో సైనిక విన్యాసాలు చేస్తున్న సీన్లు ఆ వీడియోలో ఉన్నాయి.
చైనా ఆర్మీతో పాటు ఎయిర్ ఫోర్స్ కు చెందిన వారు సైనిక విన్యాసాలు చేస్తున్నారు. సెంట్రల్ చైనాలోని హుబే ప్రావిన్స్ కు ఈశాన్యంలో ఈ వీడియోను తీసినట్లుగా సదరు మీడియా సంస్థ వెల్లడించింది. భారీ స్థాయిలో మిలటరీ ఆయుధాలు.. వాహనాలు పెద్ద ఎత్తున సాగినఈ ఆపరేషన్ ను కొద్ది గంటల్లో ముగించారు. తమ సైనిక స్థావరాల నుంచి సరిహద్దుల్లోకి ఎంత వేగంగా తమ సైనికుల్ని పంపే సామర్థ్యం తమకుందన్న సందేశాన్ని చాటి చెప్పటమే తాజా వీడియో లక్ష్యమంటున్నారు.

మేమేం చేసినా చూస్తుండటం మీకే మంచిది.. మా శక్తి సామర్థ్యాల ముందు మీరెంత? అన్న రీతిలో భారత్ కు బెదిరింపులకు గురి చేసేలా ఈ వీడియో ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తంగా చూస్తే.. భారత్ కు బెదిరింపులతో కూడిన ఒత్తిడిని పెంచటం తో పాటు.. పరోక్షంగా అమెరికాకు తానేమిటో మరోసారి తెలిసేలా చేయటం కూడా ట్వీట్ లక్ష్యమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవల కాలంలో చైనా తో ఉన్న సరిహద్దు ప్రాంతాలకు భారత్ రోడ్డు నిర్మాణాన్ని ఆపేలా చేయాలన్నది చైనా వ్యూహంగా చెబుతున్నారు. మరి.. ఈ వీడియోకు భారత సర్కారు ఏ రీతిలో రియాక్టు అవుతుందన్నది  ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Full ViewFull View
Tags:    

Similar News