బాబు ఆర్డ‌ర్స్‌!..టీఆర్ ఎస్ నేత‌ల‌ను క‌లిస్తే చ‌ర్య‌లే!

Update: 2019-01-17 15:39 GMT
టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుకు ఇప్పుడు నిజంగానే భ‌యం ప‌ట్టుకుంది. ఎక్క‌డ పార్టీ నేత‌లు జారిపోతారోన‌ని ఆయ‌న ఇప్పుడు తెగ వ‌ణికిపోతున్నారు. ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌ ను త‌న‌దైన శైలిలో న‌డిపించిన చంద్ర‌బాబు... ఎక్క‌డ త‌మ్ముళ్లు చేజారిపోతారోన‌ని నానా హైరానా ప‌డుతున్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ త‌ర‌హా హైరానాలో నుంచే బాబులో భ‌యం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. రాజ‌కీయ నేత‌లైతే మాత్రం... బందుత్వం - స్నేహాల‌ను ప‌క్క‌నపెడ‌తారా? అంత అవ‌స‌ర‌మేమీ లేదు క‌దా. అయితే బాబులోని భ‌యం తెలుగు త‌మ్ముళ్ల‌కు కొత్త‌గా ల‌క్ష్మ‌ణ రేఖ‌ను గుర్తు చేస్తోంది. ఈ త‌ర‌హా ల‌క్ష్మ‌ణ రేఖ దాటితే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వంటూ చంద్ర‌బాబు ఏకంగా వార్నింగులు జారీ చేశారు. మొన్న తెలంగాణ ఎమ్మెల్యే - టీఆర్ ఎస్ నేత త‌ల‌సాని శ్రీనివాస యాద‌వ్‌... సంక్రాంతిని పుర‌స్క‌రించుకుని ఏపీకి వ‌చ్చారు. మాస్ నేత‌కు ఏమాత్రం తీసిపోని త‌ల‌సాని... ఏపీలో జ‌రిగే కోడి పందాల‌ను ఆహ్లాదంగా తిల‌కించ‌డంతో పాటు... ఏపీలోని త‌న బంధువ‌ర్గం - స్నేహితుల‌ను క‌లిసి వెళ్లారు. ఈ సందర్భంగా త‌ల‌సానిని క‌లిసిన నేత‌ల్లో టీడీపీ నేత‌లు కూడా ఉన్నార‌న్న పుకార్లు ఇప్పుడు బాబును వెంటాడుతున్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. త‌ల‌సాని ప‌ర్య‌ట‌న‌తోనే దాదాపుగా బెంబేలెత్తిపోయిన చంద్ర‌బాబు... వ‌చ్చే నెల‌లో కేసీఆర్ ఏపీకి వ‌స్తున్నారన్న విష‌యం తెలుసుకుని మ‌రింత‌గా కంగారు ప‌డిపోతున్నారు.

ఈ నేప‌థ్యంలోనే టీడీపీ శ్రేణుల‌కు చంద్ర‌బాబు గ‌ట్టి వార్నింగులు జారీ చేస్తూ... త‌న ఆదేశాలు థిక్క‌రిస్తే... క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హూంక‌రించారు. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ కు మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టే ప‌నిలో భాగంగా నిన్న టీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌... హైద‌రాబాదులోని లోట‌స్ పాండ్‌కు వ‌చ్చి వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో భాగంగానే కేసీఆర్‌ తో ఫోన్ క‌లిపిన కేటీఆర్‌... ఆ ఫోన్‌ ను జ‌గ‌న్ చేతికిచ్చారు. ఈ సంద‌ర్భంగా చాలా విష‌యాలు మాట్లాడుకున్న కేసీఆర్ - జ‌గ‌న్‌... ఫెడ‌ర‌ల్ ఫ్రంట్‌ కు సంబంధించి మ‌లి విడ‌త చ‌ర్చ‌ల‌కు సిద్ద‌మ‌య్యారు. ఈ చ‌ర్చ‌లు ఏపీలోనే జ‌రిపేందుకు కూడా సిద్ధ‌ప‌డ్డ కేసీఆర్‌... తాను ఏపీకి వ‌స్తాన‌ని కూడా చెప్పార‌ట‌. దీనికి స‌మాధానంగా వ‌చ్చే నెల 14న అమ‌రావ‌తి స‌మీపంలో తాను కొత్త‌గా నిర్మించుకున్న ఇంటిలోకి గృహ ప్ర‌వేశం చేస్తున్నాన‌ని - ఆ కార్య‌క్ర‌మానికి రావాల‌ని కేసీఆర్‌ ను జ‌గ‌న్ ఆహ్వానించారు. ఈ ఆహ్వానాన్ని మ‌న్నించిన కేసీఆర్‌... గృహ ప్ర‌వేశానికి హాజ‌ర‌వుతాన‌ని - అక్క‌డే ఫ్రంట్ మ‌లి విడ‌త చ‌ర్చ‌లు నిర్వ‌హిద్దామ‌ని జ‌గ‌న్‌ కు చెప్పారు. మొత్తంగా నిన్న‌టి కేటీఆర్‌ - జ‌గ‌న్‌ ల భేటీ... వ‌చ్చే నెల 14న కేసీఆర్ ఏపీ టూర్‌ ను ఖ‌రారు చేసింది.

ఈ విష‌యం తెలుసుకున్న బాబుకు నిజంగానే షాక్ కొట్టినంత ప‌నైన‌ట్టుగా విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. గ‌తంలో ఏపీలోని అనంత‌పురం జిల్లాకు చెందిన ఓ టీడీపీ నేత ఇంట జ‌రిగిన వేడుక‌కు హాజ‌రైన కేసీఆర్‌కు అక్క‌డి టీడీపీ నేత‌ల‌తో పార్టీ శ్రేణులు కూడా ఘ‌న స్వాగ‌తం ప‌లికాయి. కేసీఆర్ వెళ్లాక‌... ఆయ‌న‌ను క‌లిసిన పార్టీ నేత‌ల‌ను పిలిచిన చంద్ర‌బాబు... వారికి ఫుల్ క్లాస్ తీసుకున్న విష‌యం తెలిసిందే క‌దా. ఇప్పుడు కూడా జ‌గ‌న్ గృహ ప్ర‌వేశానికి వ‌స్తున్న కేసీఆర్ వ‌ద్ద‌కు టీడీపీ నేత‌లు వెళ‌తారేమోన‌ని భ‌యం ప‌ట్టుకున్న‌ట్టుంది. దీంతోనే కేసీఆర్‌ తో గానీ - మొత్తంగా టీఆర్ ఎస్ నేత‌ల‌తో క‌లిస్తే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని చంద్ర‌బాబు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలు ఎలా ఉన్నాయంటే.. పార్టీ నియ‌మావ‌ళి అంటూ ఒక‌టి ఉంద‌ని, దానిని ఏ ఒక్క నేత కూడా దాట‌డానికి వీల్లేద‌ని చంద్ర‌బాబు చెబుతున్నారు. ఈ నియ‌మావ‌ళి బంధువులు - స్నేహితుల విష‌యంలోనూ అమ‌లులో ఉంటుంద‌ని కూడా ఆయ‌న చెప్పుకొచ్చారు. ఇత‌ర పార్టీల్లో బంధువులు - స్నేహితులు ఉన్నా... క‌ల‌వ‌రాద‌నేది చంద్ర‌బాబు ఆదేశంగా చెప్ప‌క త‌ప్ప‌దు. అంటే.... టీఆర్ ఎస్‌ లో బందువులు - స్నేహితులు ఉన్నాకూడా వారిని టీడీపీ నేత‌లు క‌ల‌వ‌కూడ‌దంతే. గెలుపు ఇచ్చిన ఉత్సాహంతో వ‌స్తున్న కేసీఆర్‌ ను క‌ల‌వ‌కుండా తెలుగు త‌మ్ముళ్ల‌ను చంద్ర‌బాబు ఆదేశాలు ఏమాత్రం నిలువ‌రిస్తాయో చూడాలి.


Tags:    

Similar News