ఎన్టీఆర్ పై బాబు కళ్లు పడ్డాయా?

Update: 2017-09-21 13:30 GMT
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయ చాణక్యత గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అవసరాలకు తగ్గట్లుగా ఆయన ప్రాధాన్యాలు ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. 2009 ఎన్నికల సమయానికి ఆయనకు జూనియర్ ఎన్టీఆర్ అవసరమయ్యాడు. అతణ్ని చేరదీశాడు. ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకున్నాడు. తారక్ కు కూడా తెలుగుదేశం పార్టీపై ఉన్న అభిమానంతో వచ్చి ప్రచారం చేశాడు. బాగానే ఉంది. కానీ ఆ తర్వాత ఎన్టీఆర్ తో బాబు ఎలా వ్యవహరించాడో తెలిసిందే. 2009 ఎన్నికల తాలూకు వైఫల్యాన్ని ఎన్టీఆర్ కు కట్టబెట్టేసి అతణ్ని దూరం పెట్టేశారు. నారా లోకేష్ ను నాయకుడిగా ప్రొజెక్ట్ చేసే క్రమంలో ఎన్టీఆర్ ను మరింతగా తెలుగుదేశం పార్టీకి దూరం చేశారు. అతడి సినిమాలు రిలీజైనపుడు వ్యతిరేక ప్రచారం జరగడంలో కూడా కుట్ర ఉందన్న ఆరోపణలున్నాయి.

ఐతే చంద్రబాబు అండ్ కో తనతో ఎలా వ్యవహరించినప్పటికీ.. జూనియర్ ఎన్టీఆర్ మాత్రం గత రెండు మూడేళ్లలో అసాధారణంగా ఎదిగిపోయాడు. వరుసగా మూడు సూపర్ హిట్లతో తన రేంజ్ పెంచుకున్నాడు. ఇంతకుముందు జస్ట్ మాస్ వరకే పరిమితమైన అతడి ఫాలోయింగ్.. ఇప్పుడు అన్ని వర్గాలకూ విస్తరించింది. ‘బిగ్ బాస్’ షోతో మరింతగా తన పాపులారిటీ పెంచుకున్నాడు. ‘జై లవకుశ’తో అతడి రేంజ్ మరింత పెరిగేలా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు కళ్లు మళ్లీ జూనియర్ మీద పడ్డట్లు వార్తలొస్తున్నాయి. గత కొన్నాళ్ల నుంచి తారక్ ను బాబు పరిశీలిస్తున్నారని.. 2019 ఎన్నికలకు అవసరమైతే తిరిగి అతడి సేవల్ని ఉపయోగించుకుందామని చూస్తున్నారని.. ప్యాచప్ కోసం తెరవెనుక ప్రయత్నాలు మొదలుపెడుతున్నారని వార్తలొస్తున్నాయి. ‘జై లవకుశ’ ఫలితాన్ని బట్టి ఎన్టీఆర్ రేంజ్ ఏంటో అంచనా వేసే ప్రయత్నంలో బాబు ఉన్నట్లుగా చెబుతున్నారు. మరి మున్ముందు ఏం జరుగుతుందో చూద్దాం.
Tags:    

Similar News