ఏపీ సర్కారు కు షాక్.. ఐఆర్ ఎస్ అధికారి సస్సెన్షన్ రద్దు

Update: 2020-02-25 08:45 GMT
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర పరిపాలన ట్రిబ్యూనల్(క్యాట్) లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిషోర్ సస్పెన్షన్ ను తాజాగా క్యాట్ రద్దు చేసింది. అంతేకాదు.. కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు కృష్ణ కిశోర్ కు తిరిగి క్యాట్ అనుమతిలివ్వడం ఏపీ సర్కారు ను ఇరుకున పెట్టింది.

ఏపీ సీఎంగా జగన్ గద్దెనెక్కాక వివిధ అవినీతి ఆరోపణలు వచ్చిన ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్ ను సస్పెండ్ చేశారు. అయితే జాస్తి కృష్ణ కిషోర్ తన సస్సెన్షన్ అన్యాయమంటూ క్యాట్ ను ఆశ్రయించారు. కిషోర్ అప్పీళ్లను పరిశీలించిన క్యాట్ ఆయనను సస్పెండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది.

చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో జాస్తి కృష్ణ కిషోర్ ఏపీ ఆర్థిక అభివృద్ధి మండలి సీఈవో గా పనిచేశారు. టీడీపీ ప్రభుత్వం లో కీలకంగా వ్యవహరించారు. చంద్రబాబు ఏరికోరి ఈయన ను మూడేళ్ల పదవీ కాలానికి గాను ఏపీ ఆర్థిక అభివృద్ధి మండలి లో నియమించారు. 1990 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి అయిన కృష్ణ కిశోర్ గతంలో టీడీపీ సీనియర్ నేత , మాజీ ఎంపీ అశోక్ గజపతిరాజు వద్ద సెక్రెటరీ గా పనిచేశారు.

అయితే కృష్ణ కిశోర్ అవినీతికి పాల్పడ్డారంటూ జగన్ సర్కారు సస్పెండ్ చేసింది. అంతేకాదు.. కేసు నమోదు చేసి సీఐడీ, ఏసీబీ విచారణ జరుపుతోంది. ఆరు నెలల్లోగా విచారణ పూర్తి చేయాలని.. అప్పటి వరకూ అమరావతి విడిచి వెళ్లకూడదని కృష్ణ కిషోర్ ను ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. కానీ ఇప్పుడు క్యాట్ ఈ సస్పెండ్ ను రద్దు చేసి కేంద్ర సర్వీసులకు వెళ్లడానికి జాస్తి కృష్ణ కిషోర్ కు అనుమతి మంజూరు చేసింది.
Tags:    

Similar News