ఏపీ దేవాదాయ శాఖలో లంచావతారులు

Update: 2019-10-07 09:44 GMT
బతకలేక బడిపంతులు కావాలి అన్నారు ఒకప్పుడు.. ఇప్పుడు బతకలేక దేవాదాయ శాఖలో చేరాలని అంటుంటారు. పేరుకు దేవాదాయ శాఖ.. ఈ శాఖలో పనిచేసే వారు పేరుకే ప్రభుత్వ ఉద్యోగాలు.. కానీ ప్రభుత్వ ఉద్యోగులకు ఉంటే జీతభత్యాలు, ఇతర అలవెన్సులు, సౌకర్యాలు ఉండవు.. కాంట్రాక్టు ఉద్యోగాలకు ఎక్కువ.. ప్రభుత్వ ఉద్యోగాలకు తక్కువగా వీరి పరిస్థితి ఉంటుంది. అర్చకులకు వేతనాల కోసం రోడ్డెక్కిన సంగతులు ఐదేళ్ల కిందటి వరకు మనం చూశాం.

అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారినా దేవాదాయ శాఖలో పనితీరు మాత్రం మారలేదు.. లంచం లేనిదే దేవదాయశాఖలో ఏ పని జరగడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ సర్కారు ఎంత పారదర్శకతకు పెద్ద పీట వేస్తున్నా ఉన్నతాధికారులు, ప్రభుత్వ ఆదేశాలను కిందిస్థాయి సిబ్బంది భేఖారతు చేస్తూ ప్రతీ ఫైలుకు బేరాలు పెడుతున్నట్టు పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

రాష్ట్రంలోని 1992 ప్రధాన ఆలయాల్లోని ఎన్ఎంఆర్ లుగా పనిచేస్తున్న ఉద్యోగులు డీఏ ఇవ్వాలని దరఖాస్తు చేసినా ఇప్పటివరకు కమిషనరేట్ అధికారులు కమిషనర్ కు ఫైలు పంపలేకపోవడం విస్మయపరుస్తోంది. లంచాలు డిమాండ్ చేస్తూ ఇలా ఫైల్ ను తొక్కిపట్టారన్న విమర్శలు వస్తున్నాయి. లంచాలు ఇవ్వకపోవడంతో సిల్లీ కారణాలు చూపుతూ ఆ ఫైళ్లను తొక్కిపెట్టారని తెలిసింది.

పీఆర్సీ, డీఏ, బదిలీ ఇలా దరఖాస్తు చేసుకున్న దేవాదాయ శాఖలో అర్చకులు, ఉద్యోగులకు ప్రతీదానికి ఓ రేటును  కట్టి దేవాదాయ కమిషనరేట్ లోని ఉద్యోగులు వసూలు చేస్తున్నారన్న ఆరోపలున్నాయి. పనికాకపోవడం.. లాంచాలు అడుగుతుండడం.. ఇవ్వకపోతే ఏకంగా ఫైల్స్ నే మాయం చేస్తున్న ఘనులు దేవాదాయశాఖలో ఉన్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.

దీంతో త్వరలోనే వందలాది మంది దేవాదాయశాఖలోని బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడానికి సిద్ధమయ్యారు. ఇక దేవాదాయ కమిషనరేట్ లో ఉద్యోగులు, అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా కమిషనర్ పట్టించుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఆలయ ఉద్యోగులు ఫిర్యాదు చేస్తున్నా కమిషనర్ తనకిందనున్న ఉద్యోగుల పట్ల ఉదాసీనంగా వ్యవహరించడం చర్చనీయాంశమవుతోంది. దీంతో బాధితుల వేదన అరణ్యరోదనే అవుతోంది.
Tags:    

Similar News