బురదలో కూర్చొని శంఖం ఊదండి..కరోనా నుండి తప్పించుకోండి!

Update: 2020-08-14 12:30 GMT
కరోనా వైరస్ వల్ల ప్రపంచ జనజీవనం మొత్తం అతలాకుతలం అయిపోయింది. ఓవైపు ఈ కరోనా వైరస్ ను అరికడుతూనే నియంత్రించే వ్యాక్సిన్ కోసం పరిశోధకులు, శాస్త్రవేత్తలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరోవైపు కరోనా వైరస్ ఇదే అసలు పరిష్కారం అంటూ సొంత వైద్యాలు, వింత విధానాలు కూడా హల్‌ చల్ అవుతున్నాయి. దీనికి రాజకీయ నాయకులు కూడా ఏ మాత్రం అతీతం కాదు. తాజాగా రాజస్థాన్ ‌కి చెందిన బీజేపీ ఎంపీ సుఖ్‌ బీర్ సింగ్ జౌనపూరియా కూడా ఈ తరహా వ్యాఖ్యలతో వార్తల్లోకెక్కారు.

అయన ఏంచెప్పారంటే..ఒంటికి బురద రాసుకుని, శంఖం ఊదితే నోవెల్ కరోనా వైరస్ పరారైపోతుందంటూ చెప్పుకొచ్చారు. శంఖం ఊదుతూ బురదలో కూర్చుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా మన శరీరం కరోనా మహమ్మారి పై సమర్థంగా పోరాడగలదు... అని ఎంపీ సుఖ్ ‌బీర్ చెప్పారు. ఇక , ఈ ఏడాది మొదట్లో కూడా ఎంపీ గారు ఇదే తరహాలో మరికొన్ని సూచనలు చేశారు. ఒంటికి బురద రాసుకుని యోగా చేస్తే ఎలాంటి జబ్బులైనా మటుమాయం అయిపోతాయి...అంటూ యోగా డే సందర్భంగా సుఖ్‌ బీర్ చెప్పారు.

అలాగే , కేంద్రమంత్రి అర్జున్ ముండా కూడా ఈ తరహా వ్యాఖ్యలతోనే వార్తల్లో నిలిచారు. భాభీజీ అప్పడాల్లో రోగ నిరోధక శక్తిని పెంచే పదార్థాలు ఉన్నాయనీ.. కరోనా వైరస్‌ ను జయించేందుకు వీటిని తినాలంటూ ప్రచారం చేయడం అప్పట్లో బాగా వైరల్ అయింది. అయితే , అన్ని అప్పడాలు తిన్నప్పటికీ ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలడంతో చికిత్స కోసం ఆస్పత్రిలో చేరారు. ఏదేమైనా రోజుకొక వైద్యం వెలుగులోకి వస్తుంది.
Tags:    

Similar News