ప్రమాదాలకు నిలయంగా మారిన 'అటల్‌ రోహ్‌తంగ్' టన్నెల్

Update: 2020-10-07 02:30 GMT
దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభమైన ప్రపంచంలోనే అత్యంత పొడవైన అటల్‌ రోహ్‌ తంగ్‌ టన్నెల్‌ , అప్పుడే ప్రమాదాలకు నెలవుగా మారింది. ఆ టన్నెల్ ప్రారంభించిన మూడు రోజుల్లోనే మూడు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. పర్యాటకులు వేగంగా వాహనాలు నడపడం, కొందరు యువకులు బైకులపై రేసింగులు చేయడంతో ఈ ప్రమాదాలు జరిగినట్టు బోర్డర్స్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌   వెల్లడించింది. ఘటనలకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయని వెల్లడించింది. ట్రాఫిక్‌ నిబంధనల్ని ఉల్లంఘిస్తూ రన్నింగ్ ‌లోనే కొందరు సెల్ఫీలు తీసుకుంటున్నారని బీఆర్ ‌ఓ చీఫ్‌ ఇంజనీర్ ఆందోళన వ్యక్తం చేశారు.

అలాగే, ఎట్టి పరిస్థితుల్లో కూడా టన్నెల్ మధ్యలో వాహనాల్ని నిలుపరాదు అని , టన్నెల్‌ లోపల సిబ్బందిని ఏర్పాటు చేయాలని ఆయన ట్రాఫిక్‌ అధికారులను కోరారు. ఈ విషయంపై కులు ఎస్పీ గౌరవ్‌ సింగ్‌ మాట్లాడుతూ.. టన్నెల్‌ లోపల రాష్‌ డ్రైవింగ్‌, ఓవర్‌ స్పీడింగ్‌ చేసేవారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇప్పటికే టన్నెల్‌ లోపల సీడ్‌ గన్స్‌ ఆధారంగా అతివేగంగా వెళ్లిన వారికి నోటీసులు జారీ చేస్తామని అన్నారు. టన్నెల్‌ లోపల గంటకు 40 నుంచి 80 కిలోమీటర్ల వేగంతోనే వెళ్లాలని స్పష్టం చేశారు. ఇదిలాఉండగా.. అటల్‌ రోహ్‌తంగ్‌ టన్నెల్‌ ద్వారా పేలుడు పదార్థాల రవాణాను బీఆర్‌ఓ నిషేధించింది. వచ్చే రెండు నెలలపాటు డీజిల్‌, పెట్రోల్‌, ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్లు, కిరోసిన్‌పై తాత్కాలిక నిషేధం విధించినట్టు వెల్లడించింది. దాంతోపాటు ప్రతి రోజూ ఉదయం 9 నుంచి 10, సాయంత్రం 4 నుంచి 5 వరకు.. మొత్తం రెండు గంటలపాటు మెయింటెన్స్‌ నిమిత్తం టన్నెల్‌ మూసి ఉంటుందని తెలిపింది.

హిమాచల్‌ ప్రదేశ్‌లోని పీర్‌ పంజల్‌ పర్వత శ్రేణిలో నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత పొడవైన రహదారి సొరంగం ‘అటల్‌ టన్నెల్‌'ను ప్రధాని మోదీ శనివారం ప్రారంభించారు.ఈ సొరంగ మార్గం ద్వారా సైనిక వాహనాల్లో జవాన్లను, సామాగ్రిని త్వరితగతిన తరలించవచ్చు. శీతాకాలంలో మంచు కురుస్తుండటంతో మనాలీ-లేహ్‌ల మధ్య మార్గాన్ని ఏటా ఆరు నెలల పాటు మూసి వేసేవారు. ఈ టన్నెల్‌ అందుబాటులోకి రావడంతో ఇక ఆ ఇబ్బంది ఉండబోదు. మరోవైపు, ఈ సొరంగం మనాలీ-లేహ్‌ల మధ్య 46 కిలోమీటర్ల దూరాన్ని తగ్గిస్తుంది.
Tags:    

Similar News