అసదుద్దీన్‌ అసహనం: మెట్రో అధికారులను నిలదీత

Update: 2020-02-06 09:30 GMT
హైదరాబాద్‌ లో రోజురోజుకు ట్రాఫిక్ పెరుగుతోంది. నగరంలో వాహనాల వేగం నెమ్మదిస్తోంది. ట్రాఫిక్ లో చిక్కుకుంటే గంటల తరబడి వేచి ఉండాల్సిందే. దానికి కొంత పరిష్కార మార్గంగా మెట్రో రైలును వేశారు. దశల వారీగా అందుబాటులోకి వస్తున్న మెట్రో రైలుతో హైదరాబాద్ వాసులు కొంత ఊరట చెందుతున్నారు. పైసా ఎక్కువైనా పర్లేదు ప్రతి నిమిషం విలువైనదిగా భావించి పట్టణవాసులు మెట్రో రైలుకు జై కొడుతున్నారు. అయితే ఈ మెట్రో పనులు పాతబస్తీ మినహా మిగతా చోట్ల ముమ్మరంగా సాగుతున్నాయి. ఫిబ్రవరి 7వ తేదీన కొత్త మార్గం అందుబాటు లోకి రానుంది. దీంతో హైదరాబాద్ ఎంపీగా ఉన్న ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీకి మండింది. తొలి సారిగా కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తాడు.

ఈ నెల 7వ తేదీన సీఎం కేసీఆర్‌ జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ మెట్రో మార్గాన్ని ప్రారంభించనున్నారని మెట్రో సంస్థ సామాజిక మాధ్యమాల్లో ప్రకటించింది. దీన్ని చూసిన అసదుద్దీన్ మా ప్రాంతం (పాతబస్తీ)లో ఎప్పుడు ప్రారంభిస్తారని ప్రశ్నించారు. ఎంజీబీఎస్‌ నుంచి జేబీఎస్‌ వరకు మెట్రో పనులు పూర్తి చేశారు గానీ.. ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నామా మార్గంలో పనులు ఎప్పుడు మొదలుపెడతారని నిలదీశారు. ‘దార్‌ ఉల్‌ షిఫా నుంచి ఫలక్‌నామా మెట్రో లైన్‌ సంగతి ఏంటి? దక్షిణ హైదరాబాద్‌ విషయానికి వచ్చేసరికి మీ దగ్గర సమాధానం ఉండదు అని మండిపడ్డారు. జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ మార్గాన్ని పూర్తి చేయడానికి నిధులు ఉంటాయి.. గానీ ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా పనులకే ఉండవా? ఎప్పుడు పూర్తి చేస్తారు’ అని ట్విటర్‌ లో మెట్రో రైలు అధికారులను ప్రశ్నించారు. హైదరాబాద్‌ మెట్రో రైలు యాజమాన్యం పై విమర్శనాస్త్రాలు సంధించారు.

హైదరాబాద్ లో మెట్రో రైలు 72 కిలోమీటర్ల మేర నిర్మించాలనుకున్నారు. మిగతా ప్రాంతాల్లో దాదాపు పనులు పూర్తయినా పాత బస్తీలోని ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నామా మార్గం లో పనులు నిర్మాణ దశలోనే ఆగి పోయాయి. 5 కిలో మీటర్లు మినహాయిస్తే హైదరాబాద్‌ లో మెట్రోరైల్‌ నిర్మాణం మొత్తం పూర్తవుతుంది. దీనిపైనే అసదుద్దీన్ ప్రశ్నించారు.
Tags:    

Similar News