టార్గెట్ గూగుల్‌..అటునుంచి న‌రుక్కొస్తున్న ఇండియా

Update: 2019-06-21 13:54 GMT
అగ్ర‌రాజ్యం అమెరికాకు - భార‌త్‌ కు మ‌ధ్య ట్రేడ్‌ వార్ సాగుతోంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ ఎపిసోడ్‌ పై ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతున్న‌ప్ప‌టికీ...ఈ దోర‌ణి కొన‌సాగుతోంది. భారత్‌లో అమెరికా వస్తువులకు సుంకం రేట్లు భారీగా ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తరచూ విమర్శించడం...ఇందులో భాగంగా భారత వస్తువులపై సుంకాన్ని భారీగా పెంచుతామని హెచ్చరించడం  తెలిసిందే. దీనికి ధీటుగా భారత్‌ కూడా ప్రతిస్పందించింది. అమెరికా ఉత్ప‌త్తుల‌పై టార్గెట్ పెట్టింది. ఇంట‌ర్నెట్ దిగ్గ‌జం గూగుల్‌ ను టార్గెట్ చేసింది.

అమెరికాకు చెందిన గూగుల్‌ ను టార్గెట్ చేయ‌డంలో భాగంగా కాంపీటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా రంగంలోకి దిగింది. ఇతరులను మార్కెట్ లోకి రాకుండా అడ్డుకుంటుందనే ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో స‌మ‌గ్రంగా వివ‌రాలు కోరింది. గూగుల్‌ తో చేసుకున్న నిబంధనలు - షరతులపై సమాచారం కోరుతూ  శాంసంగ్‌ - షావోమి - కార్బన్ - లావాతో సహా పలు హ్యాండ్‌ సెట్ తయారీదారులకు సిసిఐ డైరెక్టర్ జనరల్  లేఖలు జారీ చేశారు. ఈ నేప‌థ్యంలో 2011 మరియు 2019 మధ్య స్మార్ట్‌ ఫోన్‌ లు - టాబ్లెట్‌ ల కోసం ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్) ద్వారా మొబైల్ ఫోన్ల వార్షిక అమ్మకం ఎంత ఉంది, అదే కాలంలో గూగుల్ లేదా దాని యూనిట్లలో ఏదైనా గూగుల్ యాప్‌ లను కోరుకునే కంపెనీలు ఇతర యాప్‌ లను ఎందుకు ఎంచుకోకూడదు - హ్యాండ్‌ సెట్ తయారీదారులు తమ సొంత యాప్ స్టోర్స్‌ - వారి యాప్‌ ల సంఖ్య - పరిశోధన - అభివృద్ధిపై వార్షిక పెట్టుబడులు - యాప్ స్టోర్ల నిర్వహణ - అప్‌ గ్రేడ్ - వార్షిక ఆదాయం గురించి సమాచారాన్ని గూగుల్‌ తో ఎందుకు పంచుకోవలసి ఉంటుంది? - స్మార్ట్‌ ఫోన్‌ లలో ప్రత్యర్థుల యాప్ స్టోర్స్‌ ను ఇన్‌ స్టాల్ చేసుకునే వెసులుబాటు ఉందా?  వెల్ల‌డించాల‌ని గూగుల్‌ ను కోరింది.ఏప్రిల్ 2011 నుంచి ఎనిమిది సంవత్సరాలలో మొబైల్ యాప్స్‌ - సేవలను ఉపయోగించడానికి గూగుల్ ఏదైనా ఆంక్షలు విధించిందో లేదో కూడా సీసీఐ వివరాలు అడిగింది.

మొబైల్‌ తయారీదారులు - గూగుల్ మధ్య ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్) మార్కెట్ వాటా ఆరోపణలపై వీటి మధ్య ఒప్పంద వివరాలను ఇవ్వాలని సిసిఐ దర్యాప్తు విభాగం మొబైల్‌ తయారీదారులను కోరింది. ఏప్రిల్ 2011 నుంచి మార్చి 2019 వరకు వార్షిక ప్రాతిపదికన ఆండ్రాయిడ్ ఓఎస్ మరియు గూగుల్ సేవలను ఉపయోగించుకోవడం కోసం గూగుల్‌ కు చెల్లించిన లైసెన్స్ ఫీజు లేదా రాయల్టీ వివరాలను కూడా కోరింది. 2012లో కూడా గూగుల్‌ తన ఆధిపత్య స్థానాన్ని దుర్వినియోగం చేసిందనే ఫిర్యాదుపై 2018లో 136 కోట్ల రూపాయల భారీ జరిమానాను భారత్‌ విధించింది. అయితే ఇంతవరకూ గూగుల్‌ జరిమానాపై స్పందించలేదు.

ఇదిలా ఉండ‌గా - దర్యాప్తుకు సహకరిస్తామని గూగుల్ తెలిపింది. నోటీసులు అందుకున్నట్లు కంపెనీలు ధృవీకరించినా ఈ విషయంపై వారు స్పందించలేదు. విచారణలో భాగంగా సీసీఐ ముందు హాజరుకావడానికి గూగుల్ అత్యున్నత అధికారులను పిలుస్తారని పరిశీలకులు భావిస్తున్నారు. ఇదే జరిగితే ట్విట్టర్‌ యాజమాన్యాన్ని విచారణకు పిలిచిన తర్వాత విచారణ ఎదుర్కొనే మరో మల్టీనేషనల్‌ కంపెనీ గూగుల్‌ అవుతుంది.


Tags:    

Similar News