ఏపీ హైకోర్టు సూటి ప్రశ్న.. రాష్ట్రపతి ఉత్తర్వులు ఇచ్చాక.. అలా చేయటమేంది?

Update: 2020-12-09 05:51 GMT
ఏపీ హైకోర్టు తాజాగా ఒక ముఖ్య అంశంపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఏపీ హైకోర్టు ప్రధాన బెంచ్ ను రాజధాని అమరావతిలో నోటిఫై చేస్తూ.. రాష్ట్రపతి ఉత్తర్వులు ఇచ్చాక.. జ్యూడిషియల్ క్యాపిటల్ పేరుతో కర్నూలులో హైకోర్టును ఎలా ఏర్పాటు చేస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం సూటిగా ప్రశ్నించింది. దీనిపై సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వివరణ ఇస్తూ.. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు మాత్రమే షురూ చేసిందన్నారు. ‘‘అది కేవలం ప్రతిపాదన మాత్రమే’’ అని ప్రభుత్వ న్యాయవాది వాదించగా.. హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘చట్టం చేసి ప్రతిపాదన అని ఎలా చెబుతారు’ అని ప్రశ్నించింది.

దీనికి బదులిచ్చిన న్యాయవాది దవే.. ప్రధాన బెంచ్ ఏర్పాటు అంశానికి అంతిమంగా రాష్ట్రపతి ఆమోదం కావాల్సిందేనని చెప్పారు. రాజధాని విషయంలో అధ్యయనానికి రాష్ట్ర ప్రభుత్వం మూడు కమిటీల్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏముందని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ వ్యాజ్యాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే. మహేశ్వరి.. జస్టిస్ ఎం. సత్యనారాయణ మూర్తి.. జస్టిస్ ఎన్.జయసూర్యలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ వ్యాజ్యాన్ని రోజువారీగా విచారిస్తోంది.

ప్రభుత్వ తరపు న్యాయవాది దుష్యంత్ దవే తన వాదనలు వినిపిస్తూ.. రాజధాని నిర్ణయం రాష్ట్ర అసెంబ్లీ వ్యవస్థకు చెందినదని.. రాజధాని విషయంలో పార్లమెంటుకు సంబంధం లేదన్నారు. ఏపీ విభజన చట్టం నిర్ణయాధికారం రాష్ట్రానికే ఇచ్చిందన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మరి.. ఈ వ్యాఖ్యలకు ఏపీ హైకోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.
Tags:    

Similar News