హై అలర్ట్ : డిసెంబర్‌ 2న ‘బురేవి’, 7న ‘టకేటీ’ !

Update: 2020-11-28 06:45 GMT
దేశంలో కరోనా మహమ్మారి ముప్పు కొనసాగుతుండగానే తుఫాన్లు ప్రజలపై మరో ముప్పుని మోపుతున్నాయి. గత మూడు రోజులుగా నివర్ తుఫాన్ ప్రభావం కారణంగా ఏపీ , తమిళనాడు లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాడు, ఏపీలోని చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురవడంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.  నివర్‌ తుపాను తీవ్రత నుంచి కోలుకోక ముందే.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడింది. ప్రస్తుత నివర్‌ తీవ్ర అల్పపీడనంగా బలహీనపడి దక్షిణ కోస్తాంధ్ర , పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతోంది. దానికి అనుబంధంగా సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకూ ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ ప్రభావంతో కోస్తాంధ్రలో శని, ఆదివారాల్లో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పలు చోట్ల కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ప్రకటించింది.

 ఇక ఈ ముప్పు తొలగక ముందే తూర్పు హిందూ మహాసముద్రం – దక్షిణ అండమాన్‌ సముద్రం మీద 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం వ్యాపించి ఉంది. తదుపరి 24 గంటల్లో ఇది క్రమంగా బలపడి తమిళనాడు, పుదుచ్చేరి మీదుగా అరేబియా సముద్రం వైపు పయనించి డిసెంబర్‌ 2 తర్వాత తుపానుగా మారే సూచనలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది తుపానుగా మారితే.. మాల్దీవులు సూచించిన ‘బురేవి’గా పేరు పెట్టనున్నారు. అదేవిధంగా.. మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో వచ్చే నెల 5న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండగా ఇది క్రమంగా బలపడి తుపానుగా మారితే దీనికి మయన్మార్‌ సూచించిన ‘టకేటీ’గా పేరు పెడతారు. కాగా గడిచిన 24 గంటల్లో నివర్‌ ప్రభావంత. రాష్ట్రమంతటా భారీ వర్షాలతో పాటు మోస్తరు వానలు విస్తారంగా కురిశాయి. భారీగా పంట నష్టం జరిగింది.
Tags:    

Similar News