5 నిమిషాల కోసం మోడీకి కాంగ్రెస్ ఎంపీల లేఖ‌

Update: 2015-10-14 05:38 GMT
అమరావతి శంకుస్థాపనకు రానున్న ప్రధాని నరేంద్ర మోడీకి ఘ‌న‌స్వాగ‌తం ప‌లుకుతామ‌ని కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యులు చిరంజీవి - కేవీపీ రామచంద్రరావు - సుబ్బిరామిరెడ్డి - జైరామ్‌ రమేశ్‌ - జేడీ శీలం తెలిపారు. రాష్ర్ట ప్ర‌జ‌ల ఆశ‌లు - ఆకాంక్ష‌లు వ్య‌క్త‌పరిచేందుకు వీలుగా త‌మ‌కు కేవ‌లం ఐదు నిమిషాల టైం ఇవ్వాల‌ని కోరుతూ వీరంతా మోడీకి లేఖ రాశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్యాకేజీ రెండూ అమ‌రావ‌తి శంకుస్థాప‌న సంద‌ర్భంగా మోడీ ప్ర‌క‌టించాల‌ని వారు విజ్ఞ‌ప్తి చేశారు. ఈ మేరకు రాష్ర్టానికి చెందిన ఎంపీల త‌ర‌పున జేడీ శీలం ప్రధానికి లేఖ రాశారు.

 ఏపీ పున‌ర్‌ వ్య‌వ‌స్థీక‌ర‌ణ చ‌ట్టంలో పొందుప‌రిచిన హామీలు - యూపీఏ క్యాబినెట్ ప్ర‌త్యేక హోదాపై చేసిన తీర్మానం కేంద్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తే న‌వ్యాంధ్ర‌లో అన్ని జిల్లాలు అభివృద్ధి చెందేందుకు బ‌ల‌మైన పునాది ఏర్ప‌డుతుంద‌ని వారు ఆ లేఖ‌లో పేర్కొన్నారు. ఎన్నికల‌కు ముందు మీరు కూడా తిరుప‌తి, విశాఖ‌ప‌ట్నం  స‌భ‌ల‌లో ఈ హామీలు నెర‌వేరుస్తామ‌ని చెప్పిన విష‌యాన్ని వారు మోడీకి గుర్తు చేశారు.

 అమరావతి పర్యటన సందర్భంగా తమకు ఐదు నిమిషాల సమయమిస్తే ఏపీకి విభజన చట్టంలోని హామీలు, రాజ్యసభలో నాటి ప్రధాని మన్మోహన్‌ ఇచ్చిన హామీలు నెరవేర్చడం గురించి వివ‌రిస్తామ‌ని కూడా ఆ లేఖ‌లో తెలిపారు. మోడీకి లేఖ రాసిన జేడీ శీలం విలేక‌ర్ల‌తో మాట్లాడుతూ న‌వ్యాంధ్ర రాజ‌ధాని అమరావతి శంకుస్థాపన చారిత్రక సందర్భం కాబట్టి ప్రధానికి స్వాగతం చెబుతామన్నారు. ఏపీకి హోదా ఇస్తామని ఎన్నికల ప్రచారంలో ఆయ‌న హామీ ఇచ్చార‌ని...దానిని నెర‌వేర్చాల‌ని ఆయ‌న్ను కోర‌తామ‌ని తెలిపారు. అలాగే హామీలను ఎవరు అమలు చేశారన్నది ముఖ్యం కాదని, అమలయ్యాయా లేదా? అన్నదే ప్రధానమని శీలం విలేకరులతో చెప్పారు. కాంగ్రెస్ ఎంపీల ఆశ‌యం మంచిగానే ఉన్నా ఈ బిజీ షెడ్యూల్‌లో మోడీ వాళ్ల‌కు అపాయింట్‌ మెంట్ ఇస్తారా లేదా అన్న‌ది సందేహ‌మే.
Tags:    

Similar News