చంద్రుడి చుట్టూ 9వేల సార్లు తిరిగిన ఆర్బిటర్..ఇస్రో కీలక ప్రకటన

Update: 2021-09-07 09:13 GMT
చంద్ర‌యాన్ 2 ల్యాండ‌ర్ చంద్రుడిపై దిగ‌డంలో విఫ‌ల‌మై కూలిపోయినప్పటికీ, ఆర్బిట‌ర్ మాత్రం త‌న ప‌ని తాను చేసుకుంటూ ముందుకుసాగుతుంది. ఇప్ప‌టికే ఇది చంద్రుడి చుట్టూ 9 వేల సార్లు తిరిగింద‌ని ఇస్రో సోమ‌వారం వెల్ల‌డించింది. ఇందులో భాగంగా ఇప్ప‌టికే అద్భుత‌మైన స‌మాచారాన్ని భూమికి చేర‌వేసిన‌ట్లు ఇండియ‌న్ స్పేస్ ఏజెన్సీ తెలిపింది. చంద్రుడి క‌క్ష్య‌లోకి చంద్ర‌యాన్‌-2 వెళ్లి రెండేళ్ల‌యిన సంద‌ర్భంగా సోమ‌వారం నుంచి రెండు రోజుల పాటు లూనార్ సైన్స్ వ‌ర్క్‌ షాప్ 2021ని ఇస్రో నిర్వ‌హిస్తోంది.

ఈ వ‌ర్క్‌ షాప్ ప్రారంభం సంద‌ర్భంగా ఇస్రో చైర్మ‌న్ కే శివ‌న్ మాట్లాడుతూ.. చంద్ర‌యాన్‌-2 స్పేస్‌ క్రాఫ్ట్‌ లోని 8 ప‌రిక‌రాలు రిమోట్ సెన్సింగ్ చేస్తున్న‌ట్లు చెప్పారు. ఇది భూమి నుంచి 100 కిలోమీట‌ర్ల ఎత్తులో ఉన్న‌ట్లు తెలిపారు. ఈ రెండేళ్ల‌లో ఈ చంద్ర‌యాన్‌-2 పంపించిన డేటాను శివ‌న్ బ‌య‌ట‌పెట్టారు. కొన్ని రోజుల క్రితం జాబిల్లి ఉపరీతలంపై హైడ్రక్సిల్, నీటి అణువులను ఆర్బిటర్ కనుగోంది. ఈ సమాచారాన్ని సేకరించి చంద్రుడిపై ఖనిజ లవణాల సమ్మేళనాన్ని పరీక్షిస్తున్నారు. ఆర్బిటర్ డేటా తో చంద్రుడిపై తేమ ఉనికి ఉన్నట్టు స్పష్టమవుతోందన్నారు శాస్త్రవేత్తలు.

చంద్రుడిపై వాతావరణ పరిస్థితులు తెలుసుకునేందుకు చంద్రయాన్‌ -2 ప్రయోగాన్ని 2019లో జులై 22న ప్రయోగించారు. ఇందులో విక్రమ్ ల్యాండర్‌ చంద్రుడి ఉపరీతలాన్ని బలంగా తాకి ల్యాండింగ్ సరిగా చేయలేకపోయింది. అయితే ఆర్బిటర్ మాత్రం కక్ష్యలో పరిభ్రమిస్తోంది. జాబిల్లి చుట్టూ తిరుగుతూ డేటాను ఎప్పటికప్పుడు చేరవేస్తోంది. చంద్రయాన్ -2 ప్రయోగం రెండేళ్లు పూర్తి చేసుకుని, 9 వేల సార్లు తిరిగింది. భారత్ గతంలో పంపిన చంద్రయాన్‌-1 విజయవంతమైంది. దానికి కొనసాగింపుగా చంద్రయాన్‌-2 ప్రయోగించారు.


Tags:    

Similar News