కరోనా ఎఫెక్ట్- మాంద్యం ముంగిట అమెరికా

Update: 2020-03-17 16:30 GMT
ఆర్థిక మాంద్యం అన్న పదం వింటే ప్రపంచ దేశాలు ఉలిక్కిపడతాయి. మాద్యం కారణంగా ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గుతుంది. అమ్మకాలు పడిపోతాయి. పరిశ్రమలు ఉత్పత్తిని తగ్గించుకోవలసి వస్తుంది. ఉద్యోగాలు ఊడిపోతాయి. నిరుద్యోగం, దారిద్ర్యం పెరుగుతాయి. మొత్తంగా దేశం దివాలా పరిస్థితుల్లోకి వెళుతుంది. అందుకే ఆర్థిక మాంద్యం పేరు వింటే అగ్రరాజ్యాలకు కూడా హడల్‌.

కరోనా వైరస్‌ ప్రజల ప్రాణాలతోనే కాక, దేశాల ఆర్థిక పరిస్థితులతోనూ ఆడుకుంటోంది. అంతర్జాతీయ వర్తక, వాణిజ్యాలు చాలావరకు తగ్గిపోయాయి. ప్రయాణాలు తగ్గి విమానయాన సంస్థలు ఈగలు తోలుకుంటున్నాయి. అమ్మకాలు, ఉత్పత్తుల పైనా ప్రభావం పడింది. ఇక స్టాక్‌ మార్కెట్లయితే చరిత్రలో ఎన్నడూ చూడని పతనాలను చూస్తున్నాయి. వైరస్‌ కారణంగా ఎదురవుతున్న సవాళ్లతో అమెరికా మాద్యం దిశగా వెళ్లే ప్రమాదముందని స్వయంగా ఆ దేశాధ్యక్షుడు ట్రంప్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్దీపన చర్యల ద్వారా వెంటనే కోలుకోగలమని కూడా అభిప్రాయపడ్డారు. ట్రంప్‌ వ్యాఖ్యలు ప్రపంచదేశాలకు డేంజర్‌ బెల్‌ లాంటివే.

ఆర్థిక మాంద్యం అంటువ్యాధి లాంటింది. ఒక్క దేశంలో అంకురించినా, ప్రపంచం మొత్తానికీ కరోనాలాగే పాకుతుంది. అమెరికా మాద్యం బారినపడితే, ప్రపంచం మొత్తమ్మీద ఆ ప్రభావం ఉంటుంది. అమెరికాలో గత 200 ఏళ్లలో 17 సార్లు ఆర్థికమాంద్యం ఏర్పడింది. 1797లో తొలి ఆర్థిక మాంద్యం అప్పుడే ఏర్పడ్డ అమెరికాను వణికించింది. 1929లో అమెరికాలో చరిత్రలోనే అతి భారీ మాద్యం నమోదైంది. 1938 వరకూ అది కొనసాగింది. 2008లో ఏర్పడ్డ మాద్యం అగ్రరాజ్యాన్ని భారీ దెబ్బకొట్టింది. ఆర్థిక సంక్షోభంలోకి నెట్టింది. సబ్‌ప్రైమ్ మార్ట్‌గేజ్ సంక్షోభంగా దాన్ని పిలిచారు. ఏడాది క్రితం కూడా ప్రపంచ దేశాలు మాంద్యం తో డీలాపడ్డాయి.
Tags:    

Similar News