విమానయాన సంస్థలకు ఆ పవర్ లేదట..

Update: 2017-07-20 11:30 GMT
కొద్ది నెలల కిందట శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్.. మొన్నటికి మొన్న టీడీపీ ఎంపీ జేసీ దివాకరరెడ్డి విమానశ్రయ సిబ్బందితో దురుసుగా ప్రవర్తించి నిషేధం ఎదుర్కొన్నారు. విమానయాన సంస్థలన్నీ వీరిని విమానాలెక్కకుండా నిషేధించాయి. అప్పట్లో గైక్వాడ్ క్షమాపణలు చెప్పడంతో ఆయనపై నిషేధం తొలగించారు. ఇప్పుడు జేసీ కూడా రాజీ ప్రయత్నాలు చేసుకుని ట్రావెల్ బ్యాన్ నుంచి బయటపడ్డారు. అయితే... ప్రయాణికులపై నిషేధం విధించే అధికారం విమానయాన సంస్థలకు లేదన్నది తాజాగా తేలిన వాస్తవం.
    
అవును.. విమానంలోగానీ, ఎయిర్‌ పోర్ట్‌ లోగానీ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ట్రావెల్‌ బ్యాన్‌ విధించే అధికారం విమానాయాన సంస్థలకు లేదట. రాజ్యసభ డిప్యూటీ స్పీకర్‌ పీజే కురియన్‌ సభాముఖంగా ఈ సంగతి చెప్పారు.  చట్టప్రతినిధులు కూడా పౌరులతోనే సమానం అని వారేదైనా తప్పు చేస్తే చట్టపరంగా పోలీసులు చర్యలు తీసుకుంటారే తప్ప వారిపై నిషేధం విధించడానికి వీల్లేదన్నారు.
    
గురువారం రాజ్యసభలో సమాజ్ వాది పార్టీ నేత నరేశ్‌ అగర్వాల్‌ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. పలు దేశీయ విమానాల్లో ప్రయాణించే సందర్భాల్లో ఉల్లంఘనకు, హింసకు పాల్పడుతున్నారనే కారణంతో ఎయిర్‌ ఇండియా వంటి పలు విమానాయాన సంస్థలు తమపై ట్రావెల్‌ బ్యాన్‌ విధిస్తున్నాయని, అసలు ఆ సంస్థలు అలా చేయొచ్చా అని కురియన్‌ ను వివరణ కోరారు. దీనికి స్పందించిన కురియన్‌.. అగర్వాల్‌ చాలా విలువైన పాయింట్‌ లేవనెత్తారని, వాస్తవానికి ఎయిర్‌ ఇండియా కానీ, మరింకేదైనా విమానయాన సంస్థకు గానీ అలాంటి అధికారం లేదని అన్నారు. ఎవరినీ శిక్షించే అధికారం ఎయిర్‌ లైన్స్‌కు లేదని... ఏ ఎంపీ అయినా నేరానికి పాల్పడితే చట్ట ప్రకారం అతడిపై చర్యలు తీసుకోవాలిగానీ, విమానాయాన సంస్థకాదని తెలిపారు.
Tags:    

Similar News