ప్ర‌ణాళిక సిద్ధ‌మైంది..ప్రజల్లోకి వస్తా

Update: 2018-01-23 09:21 GMT
 రామేశ్వరంలోని దివంగత మాజీ రాష్టప్రతి ఏపీజే అబ్దుల్ కలాం నివాసం వద్ద ఫిబ్రవరి 21న తాను రాజకీయ పార్టీని ప్రారంభిస్తానని ప్ర‌క‌టించిన విల‌క్ష‌ణ న‌టుడు క‌మ‌ల్‌ హాస‌న్ ఇపుడు మరో ముందడుగు వేశారు. వ‌చ్చే నెలలో రాజకీయ పార్టీని ప్రకటిస్తానని ఇటీవలే చెప్పిన కమల్‌ హసన్ ‘ప్రజలకు చేరువయ్యేందుకు ప్రణాళిక సిద్ధంగా ఉంది’ అని వెల్లడించారు. ఆ ప్రణాళికను అమలు చేసేందుకు సమయం ఆసన్నమైందని ఆయన తెలిపారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన తన అభిమానులతో సమావేశం అయిన అనంతరం కమల్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఈ క్లారిటీ ఇచ్చారు.

ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలిచే సంక్షేమ పథకాల గురించి అభిమానులతో చర్చించానని  క‌మ‌ల్ హాస‌న్‌ తెలిపారు. ప్రజలతో మమేకం కావడాన్ని ఓ సవాల్‌ గా తీసుకుని పనిచేయాలని అభిమానులకు విజ్ఞప్తి చేశారు. రాజకీయాల్లో తన ప్రయాణం ఇతరులకు మార్గదర్శకంగా ఉంటుందన్నారు. తన రాజకీయ ప్రయాణానికి సంబంధించి తదుపరి ఘట్టం ప్రారంభమైందని, సంక్షేమ పథకాలు కొత్తగా, విభిన్నంగా ఉండాలన్నది తన అభిమతం కాదన్నారు. ఉన్న పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలన్నదే తన తపన అన్నారు. అభిమానులంతా తనకు సోదరుల్లా ఉండాలన్నారు. ఇంతకాలం తన వెన్నంటి ఉన్న అభిమానులు ఇక ముందు కూడా తనకు అండగా ఉంటారన్నారు. వచ్చే నెల 24న మధురైలో తొలిసారిగా తాను బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని కమల్ చెప్పారు. ఫిబ్రవరి 21 నుంచి మూడు రోజులపాటు జరిగే తన పర్యటన వివరాలను త్వరలో ప్రకటిస్తానని తెలిపారు.
Tags:    

Similar News