తెలంగాణలో 8కి చేరిన ఒమిక్రాన్ కేసులు

Update: 2021-12-17 10:30 GMT
ఒమిక్రాన్ తో ప్రాణాపాయం లేదని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ డా.శ్రీనివాసరావు తెలిపారు. తెలంగాణలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 8కి చేరిన నేపథ్యంలో జాగ్రత్తలపై ఆయన దిశానిర్ధేశం చేశారు.

శంషాబాద్ విమానాశ్రయంలో సేకరించిన నమూనాల్లో 9మందికి ఒమిక్రాన్ నిర్ధారణ అయ్యిందని.. వీరిలో 8మంది రాష్ట్రంలో ప్రవేశించారని చెప్పారు. మరొక వ్యక్తి పశ్చిమ బెంగాల్ కు చెందిన వారున్నారు. ఆయన రాష్ట్రంలోకి ప్రవేశించలేదని డీహెచ్ వివరించారు.

ఒమిక్రాన్ తీవ్రత ఇప్పటికైతే లేదని.. సామాజికవ్యాప్తి జరగలేదని శ్రీనివాసరావు స్పష్టం చేశారు. నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన ఏడుగురితోపాటు హన్మకొండకు చెందిన మహిళకు ఒమిక్రాన్ సోకినట్లు ఆయన చెప్పారు.

చెక్ రిపబ్లిక్, సూడాన్, యూకే, కెన్యా , సోమాలియా దేశాల నుంచి వచ్చిన వారికి ఒమిక్రాన్ సోకిందన్నారు. హన్మకొండకు చెందిన మహిళకు 8 రోజుల తర్వాత కోవిడ్ పాజిటివ్.. ఆపై ఒమిక్రాన్ నిర్ధారణ అయ్యిందని ఆయన వివరించారు.

కాగా హన్మకొండ జిల్లాలో ఇది తొలి ఒమిక్రాన్ కేసు.. యూకే నుంచి వచ్చిన సుబేదారి ప్రాంతానికి చెందిన మహిళగా ఆమెను గుర్తించారు.

ఇప్పటివరకూ 90 దేశాల్లో ఒమిక్రాన్ వ్యాప్తి చెందిందని డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటివరకూ యూకేలో ఒక్కటి తప్పా ఎక్కడా మరణాలు నమోదు కాలేదు. 95 శాతం కంటే ఎక్కువగా ఒమిక్రాన్ సోకిన వారిలో ఎలాంటి లక్షణాలు ఉండడం లేదు. ఈ వేరియంట్ తో ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదు.

మూడో వేవ్ ను ఎదుర్కోవడానికి మేం సిద్ధంగా ఉన్నామని.. భవిష్యత్తులో మరో 10 కొత్త వేరియంట్లు వచ్చే అవకాశముందని డీహెచ్ తెలిపారు.ఒమిక్రాన్ తో అనవసర భయాందోళనలు అవసరం లేదు అన్నారు.

దీన్ని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదన్నారు. వ్యాక్సిన్ తీసుకోకపోవడం కూడా ఒమిక్రాన్ వ్యాప్తికి కారణమన్నారు. ఇంటా బయటా మాస్కులు ధరించాలని సూచించారు.


Tags:    

Similar News