ఆయిల్ పేరుతో రూ.52లక్షలు టోకరా ... ఎలా చేసారంటే !

Update: 2020-11-12 18:04 GMT
మీకు ఆ గిఫ్ట్ వచ్చింది , ఆ లాటరీ తగిలింది అంటూ  అమాయకులను బురిడీకొట్టించి లక్షలు కాజేస్తున్న సైబర్‌ నేరగాళ్లు...తాజాగా కొత్త రకం మోసానికి తెరతీశారు. ఆక్స్‌ నో హెర్బల్‌ ఆయిల్‌ లిక్విడ్‌ సరఫరా చేస్తామంటూ ఓ  వ్యాపారవేత్త నుంచి రూ.52 లక్షలు దోచేశారు. ఎస్‌ ఆర్‌ నగర్‌ పరిధిలో ఈ సంఘటన జరిగింది. కేపీహెచ్‌ బీ కాలనీకి చెందిన కె. కొండల్‌ రెడ్డి వీఎస్ ‌ఏ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్ ‌ను నిర్వహిస్తున్నారు. వివిధ సంస్థలను అవసరమైన సామగ్రిని సరఫరా చేసేవాడు. ఆయనకు ఆన్‌ లైన్‌ ద్వారా జుమాక్‌ ఫార్మాస్యుటికల్స్‌ ప్రతినిధిగా చెప్పుకున్న జాన్‌ డానియల్‌ తో పరిచయం ఏర్పడింది.

ఆక్సోనో హెర్బల్‌ ఆయిల్‌ లిక్విడ్‌ కావాలని అతను కొండల్ ‌రెడ్డిని కోరాడు. అయితే జుమాక్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్ ‌గా చెప్పుకున్న మరో వ్యక్తితో లావాదేవీలు నిర్వహించిన కొండల్‌ రెడ్డి సదరు ఆయిల్‌ కొటేషన్ ‌ను అతనికి పంపాడు. తర్వాత వారు తమకు తొలివిడతగా 500 లీటర్ల ఆక్సోనో హెర్బల్‌ ఆయిల్‌ కావాలని కొండల్‌ రెడ్డికి ఆర్డర్‌ చేశాడు. జుమాక్‌ సంస్థ ప్రతినిధులు సూచించిన విధంగా ఈ ఆయిల్‌ కోసం కొండల్‌ రెడ్డి మణిపూర్ ‌లోని ఆర్‌కే ఎంటర్‌ ప్రైజెస్‌ ప్రతినిధిగా చెప్పుకున్న రాకేష్‌ కుమార్‌ ను సంప్రదించారు. ఆయిల్‌ సరఫరా కోసం రూ. 42.63 లక్షలను రాకేష్‌ చెప్పిన ఖాతాలకు పంపాడు.

అయితే వారు ఆయిల్ ‌ని పంపలేదు. ఈ లోగా కొండల్‌ రెడ్డికి హరిప్రీత్‌ అనే మరొకరు ఫోన్ చేశాడు. రూ.10లక్షలు పంపాలని లేకపోతే ఆర్డర్ క్యాన్సిల్ అవుతుందని చెప్పాడు. దీంతో ఆ పది లక్షలను కొండల్ రెడ్డి పంపాడు. అయితే ఆయిల్‌ రాకపోగా.. రాకేష్‌ , హరిప్రీత్‌ ఫోన్లు స్విచ్ఛాప్ అయ్యాయి. దీంతో మోసపోయానని గ్రహించిన అతడు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.ఆయిల్‌ ఆర్డరు చేసినవారే, సరఫరా చేసే సంస్థ పేరును కూడా సూచించారని, అందరూ కలిసి కట్టుగా బాధితుడిని మోసం చేశారని పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Tags:    

Similar News