మనిషి రక్తం మరిగిన పులిని పట్టుకునేందుకు భారీ స్కెచ్

Update: 2020-12-04 01:30 GMT
పెద్ద పులి.. అందునా మనిషి రక్తం రుచి మరిగితే.. దాని ప్రమాదం రెట్టింపు కావటం ఖాయం. తాజాగా అలాంటి ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు కుమురంభీం జిల్లా ప్రజలు. ఇప్పటికే రెండు ఉదంతాలతో జిల్లాకు చెందిన ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతకాల్సిన దుస్థితి. దీంతో.. పులి సంచారంపై ప్రజల్లో అవగాహన పెంచటంతో పాటు.. దాన్ని పట్టుకునేందుకు జాతీయ పులుల సంరక్షణ కేంద్రం రంగంలోకి దిగనున్నట్లు చెబుతున్నారు.

కుమరం భీం జిల్లాకు చెందిన దిగిడి గ్రామానికి చెందిన విఘ్నేశ్ అనే యువకుడ్ని నవంబరు 11న.. ఈ దారుణం చోటు చేసుకున్న పద్దెనిమిది రోజులకు పెంచికల్ పేటకు చెందిన నిర్మల అనే యువతి పులి పంజాకు బలైంది. ఈ రెండు దారుణాలతో ఒక్కసారిగా హైఅలెర్టు ప్రకటించారు. అప్పటినుంచి అటవీ ప్రాంతానికి దగ్గర్లో ఉండే గ్రామాల ప్రజల్ని మరింత అప్రమత్తంగా ఉంచుతున్నారు.

తాజాగా అటవీ శాఖాధికారితో కమిటీని వేయటంతో పాటు.. అటవీ ప్రాంతాలకు దగ్గర్లో ఉండే గ్రామాల్లోనూ భారీ ఎత్తున అవగాహన కల్పిస్తున్నారు. పొలాలకు వెళ్లాలన్నా.. పది మంది కలిసి వెళ్లాలని.. పెద్ద ఎత్తున డప్పు కొట్టుకుంటూ వెళ్లాలని సూచిస్తున్నారు. అడవిలోకిఅస్సలు వెళ్లొద్దని చెబుతున్నారు. వీలైనంత త్వరగా పెద్ద పులిని పట్టుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మరి.. వీరి ప్లాన్ ఎంతమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
Tags:    

Similar News