మహిళల ఆస్తి వివాదాలపై సుప్రీంకోర్టు కీలక సూచన.. అలా చేస్తే ఏ గొడవ ఉండదా?

దేశంలో హిందూ మహిళల ఆస్తులపై గత కొన్నేళ్లుగా వివాదాలు చోటుచేసుకుంటున్నాయి.;

Update: 2025-11-20 03:07 GMT

దేశంలో హిందూ మహిళల ఆస్తులపై గత కొన్నేళ్లుగా వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. హిందూ మహిళ ఆస్తి కోసం పుట్టింటివారు, అత్తింటివారు కోర్టు మెట్లు ఎక్కుతున్న ఘటనలు అనేకం జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. మహిళలు తమ మరణాంతరం ఆస్తిపై వివాదం లేకుండా ఉండాలంటే, వారు బతికి ఉండగానే ఆస్తి ఎవరికి చెందాలనే విషయంలో స్పష్టంగా వీలునామా రాయాలని సూచించింది.

మహిళకు పిల్లలు లేకపోతే ప్రస్తుత హిందూ వారసత్వ చట్టం ప్రకారం ఆమె ఆస్తి మొదటగా భర్త కుటుంబానికి వెళ్లే అవకాశం ఉంటుందని కోర్టు గుర్తు చేసింది. కానీ, చాలా సందర్భాల్లో ఆస్తి విషయమై మహిళ పుట్టింటి వాళ్లకు, అత్తింటి వారికి మధ్య వివాదాలు చెలరేగుతున్నాయని పేర్కొంది. వివాహానంతరం మహిళ గోత్రం మారుతుందన్న సంప్రదాయ అంశాన్ని కూడా కోర్టు ప్రస్తావిస్తూ వివాహం తర్వాత మహిళపై ప్రధాన బాధ్యత భర్త కుటుంబానిదే అవుతుందని పేర్కొంది.

కానీ పిల్లలు లేని మహిళల ఆస్తుల విషయంలో విడాకులు తీసుకోకుండా భర్తకు దూరంగా ఉంటున్న మహిళల ఆస్తుల విషయంలో వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కారణంగా వారసత్వ హక్కుల్లో తలెత్తే సమస్యలు పరిష్కరించేందుకు ప్రీ-లిటిగేషన్ మిడియేషన్ (మధ్యవర్తిత్వం) తప్పనిసరి చేయాలని కోర్టు ఆదేశించింది. మధ్యవర్తిత్వంలో వచ్చే ఒప్పందాలను కోర్టు తీర్పు (డిక్రీ)గా పరిగణించాలని తెలిపింది.

కొంతమంది న్యాయవాదులు ప్రస్తుత వారసత్వ చట్టంలోని సెక్షన్ 15(1)(బి) వివక్షాత్మకమని అభిప్రాయపడుతున్నారని, దాన్ని మార్చాలంటే చట్ట సవరణ చేయాలని, అది పార్లమెంటు చేయాల్సిన పని మాత్రమేనని న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రస్తుతం అమలులో ఉన్న హిందూ వారసత్వ చట్టం ప్రకారం ఒక హిందూ మహిళ వీలునామా లేకుండా చనిపోతే ఆమె భర్త, కుమారుడు, కుమార్తె ఎవరూ లేకపోతే ఆమె ఆస్తి తల్లిదండ్రులకు వెళ్తుంది. ఈ చట్టం విషయంలో మహిళల తల్లిదండ్రుల్లో ఆందోళనలు మొదలయ్యాయి. దీంతో వివాదాల కారణంగా ఎక్కువ మంది కోర్టులను ఆశ్రయిస్తున్నారు.

1956లో చట్టం చేసినప్పుడు మహిళలు పెద్ద మొత్తంలో ఆస్తులు సంపాదిస్తారని ప్రభుత్వం ఊహించలేదని, కానీ ఇప్పుడు విద్య, ఉద్యోగాలు, వ్యాపారాల్లో ముందుకు వెళ్తున్న మహిళలు గణనీయంగా స్వంత ఆస్తులు సంపాదిస్తున్నారని అలాంటి ఆస్తుల విషయంలో వారు వీలునామా రాయకుండా చనిపోతే, ఆస్తి భర్త వైపు బంధువులకే వెళ్లడం తల్లిదండ్రులకు బాధ కలిగించే అంశమని కోర్టు గమనించింది. దీంతో సెక్షన్ 15(1)(బి)పై తీర్పు ఇవ్వకుండా ఇలాంటి వివాదాలపై మధ్యవర్తిత్వం తప్పనిసరి అంటూ సూచనలు చేసింది. తాలుకా, జిల్లా, రాష్ట్రస్థాయిలో లీగల్ సర్వీసెస్ అథారిటీలు మధ్యవర్తిత్వం నిర్వహించాలని ఈ విధానం వల్ల కోర్టులకు వెళ్లే కేసుల సంఖ్య తగ్గించమే కాకుండా, కుటుంబాల మధ్య గొడవలు పెరగకుండా చూడొచ్చని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

Tags:    

Similar News