'మీ కళ్లు కాకులు ఎత్తుకుపోకపోతే ఈ వీడియో చూడండి'.. వైసీపీ స్ట్రాంగ్ మెసేజ్!
పొదిలిలో వైసీపీ చేపట్టిన ర్యాలీకి.. అక్కడ వారు ప్రవర్తించిన తీరుకీ ఏమాత్రం సంబంధం లేదని ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. రైతుల ముసుగులో మహిళలు, పోలీసులపై రాళ్లు విసిరారని తెలిపారు.;

ప్రకాశం జిల్లా పొదిలిలో వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా తీవ్ర ఉద్రిక్త వాతావారణం నెలకొన్న సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా స్పందించిన ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి.. వైసీపీపై ఘాటు విమర్శలు చేశారు. ఇందులో భాగంగా.. రైతుల ముసుగులో మహిళలు, పోలీసులపై వైసీపీ శ్రేణులు రాళ్లు విసిరారని అన్నారు. దీనిపై తాజాగా వైసీపీ స్పందించింది. ‘ఎక్స్’ వేదికగా వీడియో విడుదల చేస్తూ ప్రశ్నల వర్షం కురిపించింది.
అవును... పొదిలిలో వైసీపీ చేపట్టిన ర్యాలీకి.. అక్కడ వారు ప్రవర్తించిన తీరుకీ ఏమాత్రం సంబంధం లేదని ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. రైతుల ముసుగులో మహిళలు, పోలీసులపై రాళ్లు విసిరారని తెలిపారు. ఇదే సమయంలో... వైసీపీ కార్యకర్తలు ప్రవర్తిస్తున్న తీరును రైతులు గుర్తించాలని కోరారు. ప్రజా సమస్యలపై ఆ పార్టీకి చిత్తశుద్ధి లేదని.. ఒకవేళ నిజంగా ఉంటే ఆ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలని ఫైరయ్యారు.
దీనిపై తాజాగా వైసీపీ సోషల్ మీడియా వేదికగా స్పందించింది. ఇందులో భాగంగా... 'పొదిలిలో దాడి చేసింది, అరాచకం సృష్టించింది ఎవరు పార్థసార గారూ?'.. 'వైసీపీ నాయకులే చేశారని మీ నాయకుడు చంద్రబాబు చెప్పమన్నాడా?' అని ప్రశ్నించిన వైసీపీ... 'మంత్రి స్థానంలో ఉండి అబద్ధాలు చెప్పడానికి సిగ్గులేదా?' అని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా పలు ప్రశ్నలను సంధిస్తూ.. వీడియో విడుదల చేసింది.
ఇందులో భాగంగా... ‘పొగాకు పంటకు కనీస మద్దతు ధరలు లభించక రైతులు అన్యాయానికి గురవుతుంటే.. వారిని పరామర్శించి భరోసా ఇవ్వడానికి ప్రకాశం జిల్లా పొదిలికి వైఎస్ జగన్ వెళ్తే.. ఆ కార్యక్రమాన్ని డైవర్ట్ చేయడానికి మీరు, మీ పార్టీ కుట్రలు చేయలేదా?’ అని ప్రశ్నించిన వైసీపీ... ‘జగన్ రైతులను పరామర్శించే ఈ కార్యక్రమానికి సంఘీభావంగా దాదాపు 40 వేలమంది రైతులు, ప్రజలు అక్కడికి తరలివచ్చారు’ అని తెలిపింది.
ఆ సమయంలో.. ‘జగన్ వెళ్లే మార్గంలో మీరు 40 మంది టీడీపీ కార్యకర్తలను పెట్టి, వారిని ఉసిగొల్పి, రాళ్లు విసిరి గలాటా చేయించింది మీరు కాదా?.. కానీ ప్రజలు, రైతులు ఆ పన్నాగాన్ని అర్థం చేసుకుని అత్యంత సంయమనంతో వ్యవహరించిన మాట వాస్తవం కాదా?.. హింసను సృష్టించడానికి మీరు పంపిన ఆ 40 మంది చేసిన దుశ్చర్యలపైన, అక్కడున్న 40 వేల మంది ప్రజలు, రైతులు ప్రతిస్పందించి ఉంటే ఏం జరిగి ఉండేది మంత్రి గారూ?’ అని నిలదీసింది!
ఇదే సమయంలో... ‘రైతుల సమస్యలపై జగన్ గొంతెత్తితే.. దాన్ని డైవర్ట్ చేయడానికి మీరు ఇలా చేయించడం దుర్మార్గం కాదా? పైగా ఉల్టా రాళ్లు మీవాళ్లు విసిరితే, మీరు ఉసిగొల్పిన మీ కార్యకర్తలు గొడవలు చేసే ప్రయత్నం చేస్తే, అన్యాయంగా రైతులపై, ప్రజలపై కేసులు పెడతారా? ఇది దుర్మార్గం కాదా?’ అని ప్రశ్నల వర్షం కురిపించింది వైసీపీ. ఈ సందర్భంగా.. ‘మీ కళ్లు కాకులు ఎత్తుకుపోకపోతే ఇక్కడ పోస్టు చేసిన వీడియోలు ఓసారి శ్రద్ధగా చూడాలి’ అని పార్థసారథిని కోరింది.