వైసీపీ లోగుట్టు...దిద్దుకోకపోతే భారీ షాక్ ?
వైసీపీ పైకి పటిష్టంగా ఉన్నట్లుగా కనిపిస్తోంది. కానీ సంస్థాగతంగా ఎన్నో లోపాలు సమస్యలు ఉన్నాయని అంటున్నారు.
వైసీపీ పైకి పటిష్టంగా ఉన్నట్లుగా కనిపిస్తోంది. కానీ సంస్థాగతంగా ఎన్నో లోపాలు సమస్యలు ఉన్నాయని అంటున్నారు. రాజకీయాల్లో జనాదరణ ఉండడం ఒక్కటే కొలమానం కాదు, ప్రజాకర్షణ అంటే జనాలను ఎక్కువగా తమ సభలకు రప్పించుకోవచ్చు.జేజేలు పలికించుకోవచ్చు. అయితే అవన్నీ ఓట్లు కావు. ఓట్లుగా మారాలంటే ఆ కధ వేరేగా ఉంటుంది. పొలిటికల్ గ్లామర్ వేరు పొలిటికల్ గ్రామర్ వేరు. గ్లామర్ లేకుండా గ్రామర్ ఉన్నా రాజకీయంగా రాణించవచ్చు. కానీ గ్లామర్ ఉండి గ్రామర్ లేకపోతే మాత్రం మనుగడ కష్టంగా మారుతుంది. దీనికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. పుబ్బలో పుట్టి మఖలో మాడిపోయిన పార్టీలు కూడా ఉన్నాయి. ఎంతో మంది సెలిబ్రిటీలకు తరగని జనాదరణ ఉంటుంది. కానీ వారు రాజకీయంగా పార్టీలు పెట్టి ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నారు అంటే పొలిటికల్ గ్రామర్ లేకపోవడమే అన్నది నిష్టుర సత్యం.
గ్రాఫ్ పెరుగుతోంది అంటూ :
ఇటీవల కాలంలో కొన్ని సర్వేలు వస్తున్నాయి. వైసీపీ గ్రాఫ్ పెరుగుతోంది అని అంటూ. అందులో అతిశయోక్తులు పక్కన పెడితే నిజాలు కూడా ఉన్నాయి. ఎలా అంటే అధికారంలో ఉన్న పార్టీకి యాంటీ ఇంకెంబెన్సీ అన్నది సహజం. మరి అది ప్రతిపక్షానికే టర్న్ అవుతుంది. అలా వైసీపీకి కూడా జరిగి ఉండొచ్చు. కానీ అలా గ్రావిటీ మాదిరిగా వస్తున్న ఈ యాంటీ ఇంకెంబెన్సీని ఒడిసి పట్టుకుని తమకు అనుకూలంగా చేసుకునే సామర్ధ్యం సత్తా వైసీపీకి ఏ మేరకు ఉన్నాయన్నదే అసలైన ప్రశ్నగా ముందుకు వస్తోంది. వైసీపీ పెట్టి పదిహేనేళ్ళు అయింది కదా ఆ పార్టీ బలంగా ఉంది కదా అంటే అవన్నీ కరెక్టే కానీ ఈ రోజున ఎలా గ్రౌండ్ లెవెల్ లో ఉంది అన్నదే ముఖ్యమని అంటున్నారు.
వారు బలంగా ఉన్నారా :
పై స్థాయిలో జగన్ కి జనాదరణ ఉండొచ్చు. కానీ ఆయన పేరుతో వచ్చే ప్రతీ ఓటుని జాగ్రత్తగా ఈవీఎంలలో వేయించుకునే స్తోమత కలిగిన పార్టీ యంత్రాంగం జిల్లాలలో నియోజకవర్గాల స్థాయిలో ఉందా అన్నదే పెద్ద చర్చ. వైసీపీ 2024లో ఓటమి పాలు అయ్యాక చాలా మంది పార్టీని వీడిపోయారు. దాని కంటే ముందు చూస్తే అనేక మంది సైలెంట్ అయ్యారు. ఇక వైసీపీ చేసిన రాజకీయ బదిలీలు షిఫ్టింగులు అన్నీ కూడా ఆ పార్టీకి అధిక శాతం అసెంబ్లీ నియోజకవర్గాలలో బలమైన ఇంచార్జిల లోటుని స్పష్టంగా చూపిస్తున్నాయని అంటున్నారు. ఒక ప్రముఖ సెఫాజలిస్టు తాజాగా వైసీపీ గ్రౌండ్ లెవెల్ పరిస్థితి గురించి మాట్లాడుతూ వైసీపీకి జనంలో ఆదరణ పెరిగినా అది ఓట్లుగా మార్చుకునేలా పార్టీ యంత్రాంగం ఉండాలని అన్నారు. నూటికి డెబ్బై శాతం అసెంబ్లీ నియోజకవర్గాలలో వైసీపీకి వీక్ అయిన ఇంచార్జిలే ఉన్నారని అన్నారు. వీరంతా వైసీపీకి ఓటు బ్యాంక్ ని పెంచే వారు కారని కూడా చెప్పుకొచ్చారు.వ్ వచ్చే ఎన్నికల నాటికి వైసీపీ బలమైన అభ్యర్ధులతో బరిలోకి దిగాల్సిన అవసరం ఉందని సూచించారు. ఎందుకంటే కూటమి బలంగా ముందుకు వస్తుందని దానిని ఢీ కొట్టాలంటే వైసీపీ ఇంచార్జిలు అన్ని విధాలుగా ఆరి తేరిన వారు అయి ఉండాలని అభిప్రాయపడ్డారు.
గమనిస్తున్నారా లేదా :
మరి వైసీపీ అధినాయకత్వం దీనిని గమనిస్తోందా లేదా అన్నదే ప్రశ్న. వైసీపీకి చెందిన 175 అసెంబ్లీ ఇంచార్జిలతో ఇటీవల అధినాయకత్వం కీలక సమావేశాన్ని నిర్వహించింది. అలాగే వారి పని తీరుని ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తున్నామని చెబుతోంది. మరి అన్నీ చేస్తున్న వైసీపీ పెద్దలకు ఈ వీక్ పాయింట్ ఏంటో స్పష్టంగా తెలియదా అన్నది ఒక చర్చ. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా మూడేళ్ళ వ్యవధి ఉంది కాబట్టి వైసీపీ సంస్థాగతంగా బలంగా ఉండేలా ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలకు దిగాలని హితైషులు సూచిస్తున్నారు. లేకపోతే భారీ షాక్ తగిలినా తగలవచ్చు అని అంటున్నారు.