ఆ ముగ్గురు ఎక్కడున్నారు? పరారీలో వైసీపీ నేతలు.. అరెస్టుకు పోలీసుల ప్రయత్నాలు!
ఏపీ పోలీసులకు ముగ్గురు వైసీపీ నేతలు గట్టి సవాలే విసురుతున్నారు. వారి అరెస్టుకు న్యాయస్థానాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా, పోలీసులు మాత్రం వారిని పట్టుకోలేకపోతున్నారని అంటున్నారు.;

ఏపీ పోలీసులకు ముగ్గురు వైసీపీ నేతలు గట్టి సవాలే విసురుతున్నారు. వారి అరెస్టుకు న్యాయస్థానాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా, పోలీసులు మాత్రం వారిని పట్టుకోలేకపోతున్నారని అంటున్నారు. మరోవైపు న్యాయస్థానంలో తమకు ఊరట దక్కేవరకు ఎలా పట్టుకుంటారో చూస్తామంటూ ఆ ముగ్గురు నేతలు పోలీసుల సహనాన్ని పరీక్షిస్తున్నారు. దీంతో కూటమి ప్రభుత్వం ఆ ముగ్గురి అరెస్టుకు తీవ్రంగా శ్రమించాల్సివస్తోందని అంటున్నారు. ప్రభుత్వ ప్రతిష్ఠకే సవాలుగా మారిన ఆ ముగ్గురు నేతలపై వేర్వేరు అభియోగాలు ఉన్నాయి. వేర్వేరు జిల్లాలకు చెందిన ఆ ముగ్గరు నేతల ఎస్కేప్ పోలీసులను టెన్షన్ పెట్టిస్తోందని అంటున్నారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, వైసీపీ నేతల అరెస్టులే లక్ష్యంగా కేసులు నమోదు అవుతున్న విషయం తెలిసిందే. ఒకవైపు సోషల్ మీడియాలో అసత్య ప్రచారం, అభ్యంతర వ్యాఖ్యలపై వస్తున్న ఫిర్యాదులతో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్టు చేసి బెంబేలెత్తిస్తున్న ప్రభుత్వం, అవినీతి ఆరోపణలతోపాటు దాడులు, కబ్జా ఆరోపణలపై మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలపై కేసులు నమోదు చేస్తోంది.
ఇప్పటికే మాజీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డి, మాజీ ఎంపీ నందిగాం సురేశ్ వంటివారిని అరెస్టు చేయించిన ప్రభుత్వం ఇంకొందరిపై కేసులు నమోదు చేయించింది. అయితే మాజీ మంత్రులు కొడాలి నాని, విడదల రజిని వంటివారు ముందస్తు బెయిల్ తెచ్చుకోగా, మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా వంటివారు కేసుల ముప్పు ఎదుర్కొంటున్నారని ప్రచారం జరుగుతోంది. వీరు కాకుండా కేసులు నమోదై, ముందస్తు బెయిల్ కూడా దక్కని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, పల్నాడు జిల్లాకు చెందిన కీలక నేత పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి పోలీసులకు సవాల్ విసురుతున్నారని అంటున్నారు.
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై అక్రమ మైనింగుతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ కేసుల్లో ఆయనకు ముందస్తు బెయిల్ లభించకపోవడంతో అండర్ గ్రౌండులోకి వెళ్లిపోయారు. ఆయన ఆచూకీ కోసం పోలీసులు నెల రోజులుగా తిరుగుతున్నా ఎక్కడున్నదీ కనిపెట్టలేకపోయారని అంటున్నారు. మరోవైపు కాకాణిని ఎట్టి పరిస్థితుల్లోనూ అరెస్టు చేయాల్సిందేనని నెల్లూరు జిల్లాకు చెందిన కొందరు టీడీపీ నేతలు ఒత్తిడి తెస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో పోలీసులకు దమ్ముంటే తనను అరెస్టు చేయాలని సవాల్ విసిరిని కాకాణి.. కేసు నమోదయ్యాక అండర్ గ్రౌండుకు వెళ్లిపోవడంపైనా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవాలని చూస్తున్న కాకాణి బెయిల్ కోసం సుప్రీంకోర్టులో ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు.
అదేవిధంగా గత నెలలో సత్యసాయి జిల్లా రామగిరి మండలంలో పర్యటించిన మాజీ సీఎం జగన్ హెలికాఫ్టర్ విండ్ షీల్డ్ దెబ్బతినడానికి కారణమయ్యారంటూ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తితోపాటు వైసీపీ కార్యకర్తలపై కేసులు నమోదయ్యాయి. జగన్ పర్యటనకు ప్రభుత్వం తగిన సెక్యూరిటీ కల్పించడం లేదని వైసీపీ ఆరోపిస్తుండగా, సత్యసాయి జిల్లాలో హెలికాఫ్టర్ పై వైసీసీ అభిమానులు, కార్యకర్తలు దూసుకురావడంపై ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. ఈ కేసులో విచారణకు రమ్మంటూ హెలికాఫ్టర్ పైలెట్లకు నోటీసులు జారీ చేసిన ప్రభుత్వం.. ఘటనకు ప్రధాన కారకుడనే ఆరోపణలతో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తిపై కేసు నమోదు చేసింది. ఆయన అరెస్టుకు డీజీపీ కార్యాలయమే రంగంలోకి దిగినట్లు చెబుతున్నారు. దీంతో తోపుదుర్తి కోసం పోలీసులు మూడు నాలుగు టీమ్స్ గా ఏర్పడి పక్క రాష్ట్రాల్లోనూ వెతుకుతున్నారని అంటున్నారు.
ఇక పల్నాడు జిల్లాలో అత్యంత సమస్యాత్మక నియోజకవర్గమైన మాచర్లకు చెందిన వైసీపీ నేత పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి పది నెలలుగా కనిపించకుండా తిరుగుతున్నారని అంటున్నారు. ఆయనపై పదుల సంఖ్యలో కేసులు నమోదు అయినట్లు ప్రచారం ఉంది. ప్రధానంగా ఎన్నికల సమయంలో దాడులకు సంబంధించి ఆయనపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసలో ఆయన సోదరుడు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామచంద్రారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. కానీ, వెంకట్రామిరెడ్డి మాత్రం పోలీసులకు దొరక్కుండా తిరుగుతున్నారు. ఆయన అరెస్టును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెబుతున్నారు.
పోలీసులు ఎంతలా గాలిస్తున్నా ఈ ముగ్గురు వైసీపీ నేతలు కనిపించకుండా తిరుగుతుండటం చర్చనీయాంశమవుతోంది. పోలీసులు తలచుకుంటే వారు ఎక్కడుంటారో క్షణాల్లో తెలుస్తుందని, కానీ ఉద్దేశపూర్వకంగానే వారిని విడిచిపెడుతున్నారని కొందరు సిబ్బందిపై ప్రభుత్వ పెద్దలు ఆగ్రహంగా ఉన్నట్లు చెబుతున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి అరెస్టుపై డీజీపీ కార్యాలయమే జోక్యం చేసుకుందన్న వార్తలు వైసీపీ శ్రేణులను టెన్షన్ పెడుతున్నాయంటున్నారు. దీంతో ఆ ముగ్గురు నేతల భవిష్యత్తు ఎలా ఉండబోతోందనేది ఉత్కంఠ రేపుతోంది.