విశాఖ AAA సినిమాస్ సమీపంలో 1500కోట్ల విలువైన భూమిపై టాలీవుడ్ హీరోల కన్ను!
భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం శరవేగంగా జరుగుతుండటం... వైజాగ్ నగరంలో మైక్రో మార్కెట్లు వేగంగా విస్తరిస్తుండటంతో స్థిరాస్తి రంగానికి విపరీతమైన గిరాకీ పెరిగింది.
విశాఖపట్నం మెయిన్ సిటీ పరిధిలోని అత్యంత డిమాండ్ ఉన్న ప్రాంతంలో రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (స్టీల్ ప్లాంట్) భూములు వేలానికి రావడం ఇప్పుడు విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే ప్రారంభించిన ఏఏఏ (AAA) సినిమాస్ (ఇనార్బిట్ మాల్) సమీపంలో ఉన్న సుమారు 20 ఎకరాల భూమి వేలానికి సిద్ధమైంది. ఈ ల్యాండ్ విలువ మార్కెట్ లెక్కల ప్రకారం రూ.1,500 కోట్ల నుంచి రూ.1,700 కోట్ల వరకు పలుకుతుందని అంచనా వేస్తున్నారు. బిట్ పీస్లుగా కూడా లభించే అవకాశం ఉండటంతో ఈ వేలం పాటపై ఇప్పుడు అందరి దృష్టి పడింది.
విశాఖపట్నం హెచ్బీ కాలనీలోని 18.17 ఎకరాలు (456 ప్లాట్లు), ఆటోనగర్లోని 0.56 ఎకరాల చొప్పున ఉన్న 3 ప్లాట్లతో కలిపి మొత్తం 19.29 ఎకరాల స్టీల్ ప్లాంట్ భూములను ఇ-వేలం వేస్తున్నట్లు నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ (NLMC) అధికారికంగా ప్రకటించింది. గతంలో ఇక్కడి ఉద్యోగుల క్వార్టర్లు శిథిలావస్థకు చేరడంతో వాటిని తొలగించి.. ల్యాండ్ మానిటైజేషన్లో భాగంగా ఈ విక్రయాలు చేపడుతున్నారు. ఈ వేలం ద్వారా రూ.900 కోట్ల ఆదాయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నా ప్రస్తుతం ఆ ఏరియాలో గజం ధర రూ.లక్షన్నర నుండి రూ.2 లక్షల వరకు ఉండటంతో రూ.1,700 కోట్ల వరకు రాబడి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం శరవేగంగా జరుగుతుండటం... వైజాగ్ నగరంలో మైక్రో మార్కెట్లు వేగంగా విస్తరిస్తుండటంతో స్థిరాస్తి రంగానికి విపరీతమైన గిరాకీ పెరిగింది. ప్రైమ్ లొకేషన్లో ఉన్న ఈ భూములను దక్కించుకునేందుకు కేవలం వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు మాత్రమే కాకుండా టాలీవుడ్ ప్రముఖులు కూడా రేసులోకి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. చిన్న బిట్లుగా రూ.500 కోట్ల రేంజ్ డీల్స్ చేసేందుకు వీలుండటంతో పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేసేందుకు వీళ్లు ఆసక్తి చూపుతున్నారనేది గుసగుస.
ప్రస్తుతం టాలీవుడ్లోని టాప్ పాన్ ఇండియా హీరోలు రూ.100 కోట్లకు పైగా పారితోషికంతో పాటు సినిమాల లాభాల్లో వాటాలు అందుకుంటున్నారు. అలాగే సీనియర్ స్టార్ హీరోలు కూడా రూ.50 కోట్లకు పైగా రెమ్యునరేషన్ పొందుతున్నారు. ఈ భారీ రాబడిని సురక్షితమైన, మైండ్-బ్లోయింగ్ రిటర్న్స్ ఇచ్చే భూములు - రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడిగా పెట్టాలని సినీ ప్రముఖులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే విశాఖపట్నంలో వేలానికి వస్తున్న ఈ ప్రైమ్ ల్యాండ్పై టాలీవుడ్కి చెందిన పలువురు స్టార్ హీరోలు కన్నేశారని సమాచారం. విశాఖ నుంచి భోగాపురం వరకూ మొత్తం బెల్ట్ టూరిజం, రియల్ ఎస్టేట్, ఐటి హబ్ లుగా డివైడ్ అవుతోంది. విశాఖ మెట్రో కారిడార్ సహా పలు భారీ ప్రాజెక్టులు నగరంపై పెట్టుబడిదారుల ఆసక్తిని అమాంతం పెంచాయి. ఇక్కడ మల్టీప్లెక్సుల కల్చర్ వేగంగా విస్తరిస్తుండటంతో స్టీల్ ప్లాంట్ భూములపై సెలబ్రిటీలకు విపరీతమైన ఆసక్తి నెలకొంది.
జాతీయ రహదారి NH-16కి సమీపంలో ఎలాంటి భూగర్భ నీటి సమస్యలు లేని ఈ హెచ్బీ కాలనీ స్థలాలు కమర్షియల్, రెసిడెన్షియల్ ప్రాజెక్టులకు అత్యంత అనుకూలంగా ఉంటాయి. ఈ భారీ ల్యాండ్ డీల్ కచ్చితంగా పూర్తవుతుందని..త్వరలోనే వేలంలో కోట్లాది రూపాయల పెట్టుబడులు ప్రవహించనున్నాయని పరిశ్రమ వర్గాలు, రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన నిపుణులు విశ్లేషిస్తున్నారు.