'పెట్టుబడుల'పై సాయి రెడ్డి కీలక కామెంట్లు.. బాబుకు సూచన
ఏపీలో కూటమి ప్రభుత్వం పెట్టుబడులకు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలకు చాలా ప్రాధాన్యం ఇస్తున్న విషయం తెలిసిందే.
ఏపీ లో కూటమి ప్రభుత్వం పెట్టుబడులకు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలకు చాలా ప్రాధాన్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మంత్రి నారా లోకేష్ దక్షిణా కొరియా పర్యటనకు కూడా ఈ లక్ష్యంతోనే వెళ్లారు. అలానే ఇప్పటి వరకు 8 దేశాల్లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లు పర్యటించారు. అలానే పర్యాటకం పరంగా జనసేన నాయకుడు, మంత్రి కందుల దుర్గేష్ కూడా పలు దేశాల్లో పర్యటించి వచ్చారు. మొత్తంగా పెట్టుబడుల సాధనే కీలక లక్ష్యంగా వారు అడుగులు వేస్తున్నారు.
అయితే.. ఈ పెట్టుబడుల వ్యవహారంపై తాజాగా వైసీపీ మాజీ నాయకుడు.. వి. విజయ సాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం ప్రకటనలకే పరిమితం అవుతున్నారని.. ప్రజలు వీటిపై పెద్దగా ఇంటస్ట్ర్ చూపించడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలకు కావాల్సింది ప్రకటనలు కాదన్న సాయిరెడ్డి.. వాటిని వాస్తవ రూపంలోకి తీసుకురావడమేనని చెప్పారు. గత ఎన్నికల్లో ఎన్నో ఆశలతో ప్రజలు ఓటేశారని.. కానీ, ఇప్పుడు ప్రకటనలకే ప్రభుత్వం పరిమితం అవుతోందని ఆయన ఆరోపించారు.
పెట్టుబడులు కుదుర్చుకుంటున్న సంస్థలతో వాటిని సాకారం చేసుకునే దిశగా కూడా ప్రభుత్వం వేగంగా అడుగులు వేయాలని సాయిరెడ్డి మేలైన సూచన చేశారు. లేకపోతే.. కేవలం ప్రకటనలకే పరిమితం అయినట్టుగా ఉంటుందన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమంలో సాయిరెడ్డి కీలక వ్యాఖ్యలతో కూడిన పోస్టు చేశారు. ``జనం కోరుకుంటున్నట్టుగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందో లేదో ఒక్కసారి చూసుకోవాలి. రెండు సంవత్సరాల తర్వాత కూడా ఎన్నికల నాటి పరిస్థితి ఉందేమో అనిపిస్తోంది`` అని వ్యాఖ్యానించారు.
ప్రజలకు క్లారిటీ ఉంది: టీడీపీ
సాయిరెడ్డి చేసిన ట్వీట్పై టీడీపీ కూడా అదేస్థాయిలో స్పందించింది. పెట్టుబడులు అనేవి రాత్రికి రాత్రి వచ్చేయవన్న విషయం సాయిరెడ్డికి తెలియదా? అని ప్రశ్నించింది. ఇప్పుడు పెట్టుబడులు గ్రౌండ్ అయ్యేలా సీఎం నుంచి మంత్రుల వరకు చర్యలు తీసుకుంటున్నారని.. వచ్చే 10 మాసాల్లో పెట్టుబడులు వస్తాయని.. గ్రౌండ్ వర్క్ జరుగుతోందని తెలిపారు. ప్రజల్లోఈ విషయంపై క్లారిటీ ఉందని.. సాయిరెడ్డికి తెలియకపోతే.. తెలుసుకోవాలని వ్యాఖ్యానించడం గమనార్హం.