భారత్ వాహనాలపై పన్నులు ఎందుకో చెప్పిన యూఎస్.. రియాక్షన్ ఇదే!

ఈ వ్యవహారంపై భారత్ రియాక్ట్ అయ్యింది. ఇందులో భాగంగా.. తమకు టారిఫ్‌ లు విధించే హక్కు ఉందని తేల్చిచెప్పింది.;

Update: 2025-07-18 06:33 GMT

ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మెజారిటీ దేశాలకు ట్రంప్ విధించే పన్నులు హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి. ఇక ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారత్ వంటి దేశాలపై అమెరికా సుంకాల వ్యవహారం మరింత చర్చనీయాంశమైన విషయం. ఈ సమయంలో.. భారత వాహనాలపై పన్నులు ఎందుకు విధిస్తోంది ట్రంప్ అమెరికా తెలిపింది. ఈ మేరకు ప్రపంచ వాణిజ్య సంస్థకు వెల్లడించింది.

అవును... భారత్‌ ఆటోమొబైల్‌, విడిభాగాలపై విధిస్తున్న పన్నులు ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనల ప్రకారం రక్షణాత్మక వైఖరి కిందకు రావని అమెరికా చెప్పింది. ఈ పన్నులను తమ దేశ జాతీయ భద్రతను దృష్టిలోపెట్టుకొని మాత్రమే విధించినట్లు పేర్కొంది. అక్కడితో ఆగని అగ్రరాజ్యం.. వీటిపై ఎటువంటి ప్రతీకార సుంకాలు విధించడానికి భారత్‌ కు అవకాశం లేదని వెల్లడించింది.

ఈమేరకు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూటీవో)కు వాషింగ్టన్‌ సమాచారం అందించింది. ఈ సందర్భంగా... ట్రంప్‌ తీసుకొన్న చర్యలు రక్షణాత్మక వైఖరి కాదని వెల్లడించింది. ఇదే సమయంలో... డబ్ల్యూటీవో అగ్రిమెంట్‌ ఆన్‌ సేఫ్‌ గార్డ్స్‌ కింద చేపట్టాల్సిన చర్యలను భారత్‌ పాటించడం లేదని అగ్రరాజ్యం ఆరోపించింది. అమెరికా అమెరికా సెక్షన్‌ 232 టారిఫ్‌ లను చర్చించదని తెలిపింది.

ఈ వ్యవహారంపై భారత్ రియాక్ట్ అయ్యింది. ఇందులో భాగంగా.. తమకు టారిఫ్‌ లు విధించే హక్కు ఉందని తేల్చిచెప్పింది. దీంతోపాటు అమెరికా విధించిన అదనపు పన్నుల వల్ల దేశీయ ఆటోమొబైల్‌, విడిభాగాల పరిశ్రమకు హాని జరుగుతోందని పేర్కొంది. ఈ సందర్భంగా భారత్ కూడా కొన్ని రాయితీలపై సస్పెన్షన్‌ ప్రతిపాదనలను సిద్ధం చేసింది.

కాగా... 2019లో కూడా అమెరికాకు చెందిన 28 ఉత్పత్తులపై భారత్‌ ప్రతీకార సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... యాపిల్స్‌, కెమికల్స్‌, బాధంపై ప్రతీకార సుంకాలు విధించింది. ఫలితంగా... ట్రంప్‌ కు మద్దతుదారులుగా ఉన్న రైతులపై వీటి ప్రభావం పడేలా భారత్‌ చూసుకొంది.

'టీఆర్ఎఫ్' ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన అమెరికా!:

పహల్గాం ఉగ్ర దాడికి బాధ్యత వహించిన 'ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌' (టీఆర్ఎఫ్) విషయంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగ.. దీన్ని ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఈ సందర్భంగా స్పందించిన అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో... టీఆర్‌ఎఫ్‌ అనేది పాకిస్థాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబా ముసుగు సంస్థ అని పేర్కొన్నారు.

ఈ పరిణామాలను భారత్‌ స్వాగతించింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్‌ - అమెరికా బలమైన సహకారానికి ఇది మరో నిదర్శనం అని తెలిపింది. 'ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌'ను ఉగ్ర సంస్థగా ప్రకటిస్తూ అమెరికా విదేశాంగ శాఖ తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తున్నట్లు తెలిపింది. ఉగ్రవాదాన్ని ఎన్నటికీ సహించకూడదని తెలిపింది.

Tags:    

Similar News