ఒకవైపే చర్చ.. 'మండలి'.. ఎవరికి బెనిఫిట్.. ?
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారన్న అంశంపై మండలిలో తీవ్రస్థాయిలో రచ్చ సాగుతోంది.;
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారన్న అంశంపై మండలిలో తీవ్రస్థాయిలో రచ్చ సాగుతోంది. ఇది ఎటు దారితీస్తుందన్నది తెలియడం లేదు. వాస్తవానికి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రకటనతో చర్చకు ముగింపు పలికినప్పటికీ.. దీనిని కొనసాగించేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది. ఇదిలావుంటే.. అసలు ఈ చర్చ ఎవరికి బెనిఫిట్? అనేది ఆసక్తిగా మారింది. హిందూ సామాజిక వర్గం మనోభావాలను దెబ్బతీశారని.. టీడీపీ, జనసేన సభ్యులు వాదిస్తున్నారు.
ఇక, ఇదే అంశంపై వైసీపీ సభ్యులు కూడా రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే. మండలిలో అరుపులు, కేకలు, నిరసనలు సహా.. పోడియంను చుట్టముట్టడాలు కూడా పెరిగాయి. టీడీపీ సభ్యులు, మంత్రులు హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని.. వైసీపీ నాయకులు కూడా చెబుతున్నారు. ఇలా మొత్తం గా ఇరు పక్షాలదీ.. ఒకే వాదన. హిందువుల టార్గెట్గా ఇటు టీడీపీ, అటు వైసీపీ సైతం.. వాదన చేస్తున్నాయి. మరి నిజంగానే ఈ విషయంలో హిందువులు ఎటు నిలబడాలి? అనేదిప్రశ్న.
మరోవైపు.. సమాజంలో ఈ విషయం పెద్దగా చర్చకు రావడం లేదు. ఈ విషయాన్ని పరోక్షంగా ఉప ముఖ్య మంత్రి పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. హిందువుల ఐక్యంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఇదే ఘటన ఇతర మతాల్లో జరిగి ఉంటే.. అని కూడా వ్యాఖ్యానించారు. మొత్తగా.. చూస్తే.. ఖచ్చితంగా ఈ వ్యవహారంపై చర్చ జరగాలని ప్రభుత్వం కోరుతోంది. కానీ, ఆ తరహా ప్రచారం కానీ... చర్చకానీ.. ఎక్కడా పెద్దగా కనిపించడం లేదు. కానీ, ఈ విషయంలో హిందూత్వను తీసుకురావడం ద్వారా.. టీడీపీకి కానీ.. అటు వైసీపీకి కానీ. మేలెంత? అనేది చర్చ.
ఇక, టీడీపీకి పూర్తిస్థాయిలో సెక్యులర్ పార్టీగా ముద్ర ఉంది. మెజారిటీ హిందూ సామాజిక వర్గం టీడీపీకి అనుకూలంగా ఉన్నప్పటికీ.. ఇతర మతాలు, కులాలు కూడా టీడీపీకి అనుకూలంగా ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఒకే వైపుచూస్తూ.. కేవలం హిందువల కోసమే అన్నట్టుగా చర్చను లేవనెత్తడం వల్ల.. ఇతర సామాజిక వర్గాలు దూరమయ్యే అవకాశం ఉందా? అంటే.. ఇప్పుడే చెప్పలేమని కొందరు అంటుంటే.. అయ్యే అవకాశం ఉందని మరికొందరు అంటున్నారు. ఇక, వైసీపీపై ఎలానూ ఓ ముద్ర ఉన్న నేపథ్యంలో ఆ పార్టీకి ఈ విషయంలో మేలా..? కీడా? అనేది ఎన్నికల నాటికి కానీ.. తెలియదని చెబుతున్నారు. మొత్తంగా ఈ లడ్డూ వ్యవహారం ఇప్పుడు సైలెంట్గానే ఉన్నా.. రాజకీయంగా ప్రభావం చూపించే అవకాశం ఉందని చెబుతున్నారు.