బయటకు వచ్చిన కుట్ర కోణం.. భక్తుడి వీడియో తీసింది టీటీడీ ఉద్యోగే
తిరుమలలో శ్రీవారిని దర్శించేందుకు వచ్చే భక్తులకు నిరీక్షణ అన్నది కొత్త కాదు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు పది నుంచి ఇరవై గంటల వరకు వెయిట్ చేయటం తెలిసిందే.;

తిరుమలలో శ్రీవారిని దర్శించేందుకు వచ్చే భక్తులకు నిరీక్షణ అన్నది కొత్త కాదు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు పది నుంచి ఇరవై గంటల వరకు వెయిట్ చేయటం తెలిసిందే. ఈ నిరీక్షణ పెరిగేకొద్దీ భక్తుల్లో సహనం కోల్పోతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో నిరసనలు.. తోపులాటలు చోటుచేసుకోవటం తెలిసిందే. ఇదంతా ఒక ఎత్తు అయితే.. భక్తుల్ని ఉసిగొల్పి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసే కొత్త తీరు ఈ మధ్యన చోటుచేసుకోవటం తెలిసిందే.
తిరుమల సర్వదర్శనం క్యూలైన్ లో రెండు రోజుల క్రితం కాకినాడకు చెందిన అచ్చారావు అనే భక్తుడు.. టీటీడీ ఛైర్మన్.. అధికారులకు వ్యతిరేకంగా నిరసన తెలపటం.. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావటంతో టీటీడీ ఈ ఉదంతంపై ఫోకస్ చేసింది. భక్తుల్ని రెచ్చగొట్టేలా మాట్లాడిన అచ్చారావు వైసీపీకి చెందిన నాయకుడిగా గుర్తించారు. అయితే.. తాను విచక్షణ కోల్పోయి మాట్లాడానని.. తన పొరపాటు వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నట్లుగా పేర్కొన్న అచ్చారావు.. తాను వ్యతిరేకంగా మాట్లాడితే ప్రత్యేక దర్శనం ఇస్తారన్న ఉద్దేశంతో చేసినట్లుగా పేర్కొన్నారు.
తాను చేసిన తప్పునకు టీటీడీని క్షమాపణ కోరారు.అయితే.. రాజకీయ కోణంలో వివాదాన్ని తెర మీదకు తీసుకొచ్చి భక్తుల మనోభావాల్ని దెబ్బ తీసిన నేపథ్యంలో పోలీసులు అతడిపై బైండోవర్ కేసును నమోదు చేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. క్యూలైన్ లో ఉన్న భక్తుడి వీడియో తీసింది ఎవరు? అన్న అంశంపై టీటీడీ ఫోకస్ చేయగా.. కొత్త విషయం వెలుగు చూసింది. భక్తుల్ని రెచ్చగొట్టేలా మాట్లాడిన వ్యాఖ్యల్ని రికార్డు చేసింది టీటీడీ ఉద్యోగి అన్న విషయాన్ని గుర్తించారు.
ఆరోగ్య విభాగంలో పని చేసే అతను అచ్చారావు నిరసనను ప్రోత్సహించటంతో పాటు.. వీడియో తీసి వైసీపీకి చెందిన సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వైనాన్ని విజిలెన్స్ విభాగం గుర్తించింది. ఈ ఘటన వెనుక ఉన్న కుట్ర కోణాన్ని పోలీసులు.. నిగా విభాగాలు లోతుగా విచారిస్తున్నాయి. ఈ సందర్భంగా ఈ మధ్యన వైసీపీ నేత.. మాజీ టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేసుకుంటున్నారు. టీటీడీలో తమ వాళ్లు రెండు వేల మంది పని చేస్తున్నారని.. ఏం జరిగినా తమకు ఇట్టే తెలిసిపోతుందని చెప్పటం తెలిసిందే. టీటీడీ పరిపాలనా వ్యవస్థ విశ్వసనీయత పై ప్రశ్నలు వచ్చేలా చేసిన వ్యాఖ్యల వేళలోనే.. తాజా ఉదంతం వెలుగు చూసింది.