కేబినెట్ వేదిక‌గా.. అప్పుడు మేడారం.. ఇప్పుడు యాదాద్రి!

ఇక‌, గ‌తంలో మేడారంలోనూ కేబినెట్ భేటీ నిర్వ‌హించారు. అప్ప‌ట్లో స‌మ్మ‌క్క‌-సార‌ల‌మ్మ జాత‌ర జ‌రుగుతున్న స‌మయంలోనే మేడారంలో రేవంత్ రెడ్డి త‌న మంత్రివ‌ర్గంతో భేటీ అయ్యారు.

Update: 2026-05-20 07:37 GMT

మంత్రి వ‌ర్గ స‌మావేశం అంటే.. స‌హ‌జంగా సెక్ర‌టేరియెట్ లేదా.. ముఖ్య‌మంత్రి నివాసాల్లో జ‌ర‌గ‌డం తెలిసిందే. అయితే.. తెలంగాణ లో రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం మాత్రం కొన్ని భిన్న పంథాల‌ను ఎంచుకుంటోంది. కేబినెట్ స‌మావేశాల‌నుత‌ర‌చుగా సెక్ర‌టేరియెట్‌లోనే నిర్వ‌హిస్తున్నా.. స‌మ‌యం, సంద‌ర్భం చూసుకుని భిన్న‌మైన ప్రాంతాల‌ను ఎంపిక చేసుకుని అక్క‌డ నిర్వ‌హిస్తున్నారు. త‌ద్వారా కేబినెట్ భేటీలంటే.. కామ‌న్‌గా ఉండే అభిప్రాయాల‌కు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఈ నెల 23న మంత్రి వ‌ర్గ స‌మావేశం నిర్వ‌హించాల‌ని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణ‌యించారు. అయితే.. వాస్త‌వానికిఈ భేటీని 21నే నిర్వ‌హించాల‌ని తొలుత షెడ్యూల్ ప్ర‌క‌టించారు. దానిని కూడా సెక్ర‌టేరియెట్‌లోనే నిర్వ‌హించాల‌ని భావించారు. అయితే.. అనూహ్యంగా ఈవేదిక‌ను యాదాద్రికి మార్చేశారు. యాద‌గిరిలోని ల‌క్ష్మీనృసింహ స్వామి ఆల‌యంలో కేబినెట్ స‌మావేశం నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. వాస్త‌వానికి ఇలా ఒక ఆల‌యంలో మంత్రి వ‌ర్గ భేటీ నిర్వ‌హించ‌డం ఇదే తొలిసారి. అయిన‌ప్ప‌టికీ.. ఆధ్యా త్మిక సందేశం ఇవ్వాల‌ని భావించిన ప్ర‌భుత్వం ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకుంది.

ఇక‌, గ‌తంలో మేడారంలోనూ కేబినెట్ భేటీ నిర్వ‌హించారు. అప్ప‌ట్లో స‌మ్మ‌క్క‌-సార‌ల‌మ్మ జాత‌ర జ‌రుగుతున్న స‌మయంలోనే మేడారంలో రేవంత్ రెడ్డి త‌న మంత్రివ‌ర్గంతో భేటీ అయ్యారు. నాటి భేటీలో జాతర ఏర్పాట్లు, భక్తుల సౌకర్యాలు, నిధుల విడుదల పై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అప్ప‌ట్లో ఈ కేబినెట్ స‌మావేశంపై అంద‌రూ ఆశ్చ‌ర్య పోయారు. సెక్ర‌టేరియెట్‌కు ఆవ‌ల తొలిసారి మంత్రి వ‌ర్గ భేటీని నిర్వ‌హించార‌ని చ‌ర్చించారు. దీనికి కొన‌సాగింపుగా.. ఇప్పుడు యాదాద్రిని కేబినెట్ భేటీకి వేదిక‌గా చేసుకోవ‌డం గ‌మ‌నార్హం.

నిర్ణ‌యాలు ఇవే?

తాజా కేబినెట్ స‌మావేశంలో స‌ర్ ప్ర‌క్రియ విషయంలో అనుస‌రించాల్సిన విధానాలు, రాష్ట్ర ప్ర‌భుత్వ పాత్ర‌పై చ‌ర్చించనున్న‌ట్టు తెలిసింది. అలానే.. ఉద్యోగుల బ‌కాయిల‌ను ఇప్ప‌టికే సింహ‌భాగం విడుద‌ల చేసిన నేప‌థ్యంలో మిగిలిన బ‌కాయిల‌పైనా చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుంటారు. ముఖ్యంగా ఫ్యూచ‌ర్ సిటీ నిర్మాణం.. పురోగ‌తిపైనా చ‌ర్చించే అవ‌కాశం ఉంద‌ని తెలిసింది. అలానే.. పాల‌మూరు-రంగారెడ్డి ప్రాజెక్టు విష‌యంపై కీల‌కంగా చ‌ర్చించ‌నున్నారు. దీనికి కేంద్రం కూడా స‌హ‌క‌రిస్తున్న నేప‌థ్యంలో త‌క్ష‌ణ‌మే ప‌నులు ప్రారంభించే అవ‌కాశంపై కేబినెట్ నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని భావిస్తున్నారు.

Tags:    

Similar News