వాళ్లంతా ఒక్కచాన్స్ ఎమ్మెల్యేలు..! కొత్త ఎమ్మెల్యేలతో చంద్రబాబుకు తలనొప్పి
ఏపీలో ఎన్నికలు జరిగి ఏడాది పూర్తయింది. మరో నెలరోజులైతే ప్రభుత్వం కొలువుదీరి ఏడాది అవుతుంది.;

ఏపీలో ఎన్నికలు జరిగి ఏడాది పూర్తయింది. మరో నెలరోజులైతే ప్రభుత్వం కొలువుదీరి ఏడాది అవుతుంది. భారీ మెజార్టీతో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు 95 సీఎం చెప్పుకుంటూ దూసుకుపోతున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, యువనేత, ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు లోకేశ్ పాలనతో తమదైన ముద్ర వేస్తున్నారు. ఇక మంత్రివర్గంలో మూడింట రెండొంతుల మంది కొత్తవారిని తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. ప్రభుత్వంలో ఎలా నడుచుకోవాలో వారికి మార్గనిర్దేశం చేస్తున్నారు. అయితే కొందరు మంత్రులతో సహా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు రాజకీయంగా పట్టుసాధించడంలో విఫలమవుతున్నట్లు పాలకపక్షంలో అంతర్గతంగా చర్చ జరుగుతోందని అంటున్నారు. ఎమ్మెల్యేల తీరుతో ప్రభుత్వం చేస్తున్న మంచి ప్రజల్లోకి వెళ్లకపోగా, తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్లు కూటమి పెద్దలు ఆందోళన చెందుతున్నారని ప్రచారం జరుగుతోంది.
గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 175 స్థానాలకు గాను కూటమి పార్టీలు 164 చోట్ల గెలుపొందాయి. ఇలా గెలిచిన స్థానాల్లో దాదాపు 80 మంది తొలిసారి గెలిచిన వారే.. అయితే పాలనలో కీలకంగా వ్యవహరించాల్సిన ఎమ్మెల్యేలు ఆశించిన స్థాయిలో పనితీరు కనబరచడం లేదని ప్రచారం జరుగుతోంది. ఎప్పటికప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే చేయిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు సర్వే ఫలితాలపై తరచూ ఎమ్మెల్యేలను అప్రమత్తం చేస్తున్నా, పెద్దగా మార్పు ఉండటం లేదని అంటున్నారు. ప్రభుత్వ ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లలేకపోవడం, కార్యకర్తలను పట్టించుకోకపోవడం, గ్రూపు తగాదాలు, ప్రభుత్వ ప్రతిష్ఠకు మచ్చ తెచ్చేలా కార్యకలాపాలు ఉండటంపై దాదాపు 50 మంది ఎమ్మెల్యేలు తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.
మొత్తం 164 మందిలో ఎక్కువ మంది పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అసంతృప్తితోనే ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. అటు ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ఒకేలా పరిస్థితి ఉందని అంటున్నారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. ఆర్థిక కష్టాలు ఉన్నా నెలనెలా క్రమం తప్పకుండా పింఛన్లు ఇవ్వడంతోపాటు దీపం-2 వంటి పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోంది. మరోవైపు వచ్చేనెలలో తల్లికివందనం, అన్నదాతా సుఖీభవ వంటి పథకాలను అమలు చేయనున్నారు. మెగా డీఎస్సీ ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అయినప్పటికీ ప్రభుత్వంపై సానుకూలత పెరిగేలా ఎమ్మెల్యేలు పనిచేయడం లేదని సీఎంకు నివేదిక అందిందని అంటున్నారు.
చాలా మంది ఎమ్మెల్యేలు వైసీపీ నేతలతో సంబంధాలు కొనసాగించడం, సొంత కేడర్ ను నిర్లక్ష్యం చేస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఉత్తరాంధ్రకు చెందిన ఒకరిద్దరు మంత్రులు ఇప్పటికీ పరిపాలనపై పట్టు సాధించలేకపోతున్నట్లు చెబుతున్నారు. అదేసమయంలో ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకోవడంలో ఎక్కువ మంది మంత్రులు విఫలమవుతున్నట్లు ప్రచారం జరగుతోంది. గోదావరి జిల్లాలకు చెందిన ఓ మంత్రి తన సొంత నియోజకవర్గంలో వ్యతిరేకత ఎదుర్కొంటున్నారని అంటున్నారు. అదేసమయంలో జిల్లాలో మిగిలిన నేతలను ఆయన కలుపుకుని వెళ్లలేకపోతున్నారని చెబుతున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయా మంత్రుల పనితీరుపై సూటిగానే చెబుతున్నప్పటికీ రాజకీయం చేయడంలో ప్రభుత్వపరంగా ఎలా నడుచుకోవాలనే విషయమై ఎమ్మెల్యేలు, మంత్రులు సరిగా వ్యవహరించలేకపోతున్నారని అంటున్నారు. దీంతో వారంతా ఒక్క చాన్స్ ఎమ్మెల్యేలుగా మిగిలిపోయే పరిస్థితులు ఉన్నాయని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రధానంగా ఎమ్మెల్యేలు తమ కేడర్ తో గ్యాప్ పెంచుకుంటుండటం వల్ల వచ్చే ఎన్నికల్లో మళ్లీ అవకాశం దక్కడం కష్టమని అంటున్నారు. గెలిచిన ఏడాదిలోనే ఈ స్థాయిలో వ్యతిరేకత రావడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం అంతర్మథనానికి లోనవుతున్నట్లు చెబుతున్నారు. అయితే ఇంకా చాలా సమయం ఉందని వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు తీరు మార్చుకుంటే పరిస్థితులు మారతాయని టీడీపీ అధిష్టానం సూచిస్తోంది. మరి రానున్న రోజుల్లో ఎమ్మెల్యేలు ఎలా నడుచుకుంటారో చూడాల్సివుంది.