ఎన్నికల వేళ తమిళనాట ఘోరం: 20 మంది మృతి
తమిళనాడులో ఒకవైపు ఎన్నికల వేడి రాజుకున్న సమయంలో మరో వైపు.. ఘోరం సంభవించింది. తమిళనాడులోని విరుధునగర్ జిల్లా, కట్టనార్పట్టిలోని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో ఆదివారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది.;
తమిళనాడులో ఒకవైపు ఎన్నికల వేడి రాజుకున్న సమయంలో మరో వైపు.. ఘోరం సంభవించింది. తమిళనాడులోని విరుధునగర్ జిల్లా, కట్టనార్పట్టిలోని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో ఆదివారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 20 మంది కార్మికులు మరణించినట్లు అధికారులు తెలిపారు. మరింత మంది మృత్యువుతో పోరాడుతున్నట్టు పేర్కొన్నారు.
రాజకీయ దుమారం..
ఈ ఘటన జరిగిన సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కీలక పార్టీల ముఖ్య నేతలు ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. దీంతో వారంతా స్టాలిన్ ప్రభుత్వం విమర్శలు గుప్పించారు. అత్యాచారాల గురించి ఇప్పటికే ప్రధానంగా ప్రచారం చేస్తుండగా.. దేశంలోనే అతి పెద్ద టపాసుల కర్మాగారాలు ఉన్న రాష్ట్రంలో కార్మికులకు రక్షణ లేకుండా పోయిందని విజయ్ వ్యాఖ్యానించారు. ఇక, బీజేపీ నాయకులు ఇప్పటికే ఆగ్రహంతో ఉండడంతో ఈ విషయాన్ని మరింత ఎక్కువ సీరియస్గా తీసుకున్నారు.
ఘటనపై ప్రధాని మోడీ వెంటనే స్పందించారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామన్నారు. 2 లక్షల రూపాయల చొప్పున మృతుల కుటుంబాలకు.. సాయం ప్రకటించారు. గాయపడిన వారికి 50 వేల చొప్పున సాయం చేస్తామన్నారు. ఇక, కార్యకర్తలు ఘటనా ప్రాంతంలో సాయం అందించాలని బీజేపీని ఆదేశించా రు. విజయ్ సైతం 2 లక్షల రూపాయల చొప్పున సాయం ప్రకటించారు. అన్నాడీఎంకే నేత.. పళని స్వామి సీఎం స్టాలిన్ ఉదాశీనంగా ఉన్నారని విమర్శించారు.
తాము అధికారంలోకి రాగానే.. బాణాసంచా కర్మాగారాలకు లైసెన్సు ఇచ్చే విషయంలో మరిన్ని నిబంధన లు చేరుస్తామని.. ప్రాణాలకు రక్షణ వహిస్తామని పళని స్వామి ప్రకటించారు. ఇక, సీఎం స్టాలిన్ ఈ ఘటనను రాజకీయం చేయొద్దని.. ఎన్నికల వేళ దీనిని రాజకీయంగా వినియోగించుకోవద్దని విజ్ఞప్తి చేశారు. బాధిత కటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఆయన చెప్పారు.