దుర్గం చెరువులో దూకి తనువు చాలించిన సాఫ్ట్ వేర్ ఉద్యోగిని
మాదాపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సుష్మ బుధవారం తన కార్యాలయానికి వెళ్లారు. రాత్రి ఆలస్యమైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమె తండ్రి అంజయ్య ఆందోళన చెందారు.;

హైదరాబాద్లో విషాదం చోటుచేసుకుంది. సికింద్రాబాద్ అడ్డగుట్టకు చెందిన 27 ఏళ్ల సాఫ్ట్వేర్ ఉద్యోగిని సుష్మ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన నగరంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
మాదాపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సుష్మ బుధవారం తన కార్యాలయానికి వెళ్లారు. రాత్రి ఆలస్యమైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమె తండ్రి అంజయ్య ఆందోళన చెందారు. ఆఫీస్ మేనేజర్ను సంప్రదించగా సుష్మ రాత్రి 10:30 గంటల ప్రాంతంలో ఆఫీసు నుండి బయలుదేరినట్లు తెలిపారు. అయినా ఇంటికి చేరకపోవడంతో అంజయ్య గురువారం తెల్లవారుజామున 4 గంటలకు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఉదయం 7 గంటల ప్రాంతంలో దుర్గం చెరువులో ఒక మహిళ మృతదేహం తేలియాడుతోందని పోలీసులకు సమాచారం అందింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని సుష్మదిగా గుర్తించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు.
-దర్యాప్తు ప్రారంభం:
సుష్మ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు సుష్మ కుటుంబ సభ్యులు, స్నేహితుల నుండి సమాచారం సేకరిస్తున్నారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. సుష్మ మరణ వార్తతో ఆమె కుటుంబ సభ్యులు, సన్నిహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.