సుజనా చౌదరి ఫోకస్ అక్కడ పెట్టేశారా ?
తెలుగుదేశం పార్టీలో పుట్టి అందులో పెరిగి రెండు సార్లు రాజ్యసభ పదవిని అందుకున్న వారు సుజనా చౌదరి.
తెలుగుదేశం పార్టీలో పుట్టి అందులో పెరిగి రెండు సార్లు రాజ్యసభ పదవిని అందుకున్న వారు సుజనా చౌదరి. ఆయన సీనియర్ మోస్ట్ లీడర్. టీడీపీలో ఉన్నపుడు అధినాయకుడికి ఎంతో సన్నిహితంగా ఉంటూ వచ్చారని ప్రచారంలో ఉంది. అంతే కాదు ఆయన పార్టీకి అందించిన అండదండలు కానీ ఇతరత్రా వ్యూహాలు కానీ అప్పట్లో గొప్పగా చెప్పుకునేవారు. అయితే 2019లో టీడీపీ ఓటమి పాలు కావడంతో ఆయన 2020లో బీజేపీలో చేరిపోయారు. ఇంకా రెండేళ్ళ పాటు ఎంపీ పదవి ఉండగానే ఆయన పార్టీ మారారు. దాంతో కేంద్ర మంత్రి పదవి ఆయనకు దక్కుతుందని ప్రచారం కూడా సాగింది. ఆయనకు 2015 ప్రాంతంలో మోడీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రి పదవి ఒకసారి ఇచ్చారు.
అనుకోని విధంగానే :
ఇదిలా ఉంటే 2024 ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ సీటు నుంచి ఎంపీగా పోటీ చేయాలని సుజనా చౌదరి భావించారు. బీజేపీ కూటమిలో ఉంది కాబట్టి పొత్తులలో భాగంగా ఈ సీటు తీసుకోవాలని అనుకున్నారు. పైగా సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని వైసీపీలోకి మారడం కూడా ఆయనకు ఆశలను పెంచింది. కానీ నాని తమ్ముడు చిన్ని అనుకోని విధంగా రంగ ప్రవేశం చేయడంతో పాటు టీడీపీ కూడా రాజధాని ప్రాంతంలో సీటు గుండెకాయ లాంటి విజయవాడను తమకే అట్టేబెట్టుకోఅవలని నిర్ణయించడంతో సుజనా ఆశలు అడియాశలు అయ్యాయని చెబుతారు. ఇక చివరి నిముషంలో ఆయన విజయవాడ పశ్చిమ అసెంబ్లీ సీటుకు పోటీ చేశారు. గతంలో టీడీపీ కూడా గెలవని ఆ సీటులో లాస్ట్ మినిట్ లో వచ్చినా గెలిచారు అంటే అది సుజనాకు ఉన్న పట్టు అని చెబుతారు. విజయవాడ పార్లమెంట్ పరిధిలోని మొత్తం అన్ని అసెంబ్లీ సీట్ల మీద ఆయనకు అవగాహన ఉండడమే కాదు స్థానికంగా బలం ఉందని అనుచర గణం ఉందని చెబుతారు.
మంత్రి పదవి దక్కదా :
ఇక ఏపీలో మంత్రి వర్గ విస్తరణ జరుగుతునని ఊరిస్తున్నారు కానీ అది జరుగుతుందా జరిగినా ఎంతమందికి చోటు ఇస్తారు అన్నది ఒక చర్చగా ఉంది. ఏపీలో చూస్తే బీజేపీకి ఒక బెర్త్ ఇచ్చారు. రెండవ బెర్త్ ఇచ్చినా అది కాపులకు కానీ బీసీలకు కానీ ఇస్తారు అని అంటున్నారు. సుజనాకు మంత్రి పదవి అంటే అది ప్రాంతీయ సామాజిక సమీకరణల వల్ల కుదిరే వ్యవహారం కాదనే అంటున్నారు. దాంతో ఆయన తన పని తాను చేసుకుని పోతున్నారు అని అంటున్నారు. తన నియోజకవర్గం సమస్యల మీద పూర్తి స్థాయిలో దృష్టి పెడుతూ ఆయన చేసుకుని వెళ్తున్నారు. ఆయన ఆలోచనలు ఇపుడు 2029 ఎన్నికల మీదనే ఉన్నాయని అంటున్నారు.
ఈసారి గురి తప్పదు :
ఇదిలా ఉంటే సుజనా ఆలోచనలు అన్నీ పార్లమెంట్ సీటు మీదనే ఉన్నాయని చెబుతున్నారు. ఆయన కేంద్ర రాజకీయాల్లోకే వెళ్లాలని చూస్తున్నారు అంటున్నారు. 2029 నాటికి పరిస్థితులు మారుతాయని చెబుతున్నారు. దాంతో ఈసారి బీజేపీకి ఎంపీల సీట్లు కూడా ఎక్కువగా వస్తాయని అందులో విజయవాడ నుంచి తాను పోటీ చేయడం ఖాయమని ఆయన భావిస్తున్నారు అని అనుచరులు అంటున్నారు. పార్లమెంట్ సీటులో గెలిచి ఢిల్లీకి వెళ్తే కేంద్ర మంత్రి పదవి దక్కుతుందని ఢిల్లీ రాజకీయాలలోనే కుదురుకోవచ్చు అన్నది సుజనా చౌదరి ఆలోచనలుగా చెబుతున్నారు. అందుకే ఆయన చాలా సైలెంట్ గా తన పని తాను చేసుకుంటున్నారు అని అంటున్నారు. మొత్తానికి సుజనా మౌనం వెనక వ్యూహాలు చాలానే ఉన్నాయని అంటున్నారు.