చిన్నమ్మను సెంటిమెంటు వెంటాడుతోందా.. ?
బీజేపీ నాయకురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరికి సెంటిమెంటు వెంటాడుతోందా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది.
బీజేపీ నాయకురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరికి సెంటిమెంటు వెంటాడుతోందా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. ఒకసారి ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేసిన నాయకులు.. ఆ నియోజకవర్గంలోనే పాతుకుపోయేందుకు ప్రయత్నిస్తారు. ఒక నియోజకవర్గాన్ని నమ్ముకుంటే.. అక్కడే రాజకీయాలు చేసిన నాయకులు కూడా ఉన్నారు. ఇలా.. అనేక మంది నాయకులు ఉన్నారు. అయితే.. పురందేశ్వరికి ఈ విషయంలో రాజకీయాలు కలిసి రావడం లేదు.
2009లో విశాఖ నుంచి ఆమె కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేశారు. విజయం దక్కించుకున్నారు. కేంద్రంలో మంత్రి కూడా అయ్యారు. కానీ, 2014కు వచ్చే సరికి రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్తో విభేధించి బీజేపీలో చేరారు. ఆ సమయంలోనూ విశాఖ నుంచే పోటీ చేయాలని అనుకున్నా.. కుదరలేదు. రాజంపేటకు మారాల్సి వచ్చింది. ఫలితంగా.. ఓటమిని ఎదుర్కొనక తప్పలేదు.
ఇక, 2019లో పట్టుబట్టి విశాఖ నుంచి పోటీ చేసినా.. బీజేపీకి సానుకూల పవనాలు వీచలేదు. దీంతో మరో ఓటమి ఎదురైంది. ఇక, 2024లో అనూహ్యంగా రాజమండ్రి పార్లమెంటు సీటు దక్కింది. కూటమి హవాలో ఆమె విజయం దక్కించుకున్నారు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ, అసలు సంగతి ఇక్కడే మొదలైంది. వచ్చే ఎన్నికలకు సంబంధించి.. ఇప్పటి నుంచే ఓ కాపు సామాజిక వర్గం ఫైర్ బ్రాండ్ నాయకుడు, ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న నేత.. రాజమండ్రిలో చక్రం తిప్పుతున్నారు.
వచ్చే ఎన్నికల్లో తాను చెప్పిన వారికే ఇక్కడ టికెట్ ఇస్తారని.. సదరు నేత.. బలంగా చెబుతుండడం గమనార్హం. అంతేకాదు.. బీజేపీ రాష్ట్ర విభాగంలో ఎంత మంది నాయకులు ఉన్నా.. సదరు నేత స్టయిలే వేరు. పైస్థాయిలో ఎలాంటి వారినైనా ఒప్పించే మనస్తత్వం, చాకచక్యంతో పాటు ఆర్ఎస్ఎస్ లోనూ.. ఆయన బలమైన సపోర్టు ఉంది. దీంతో ఆయన ఆశించింది ఇప్పటి వరకు కాదన్న పాపాన పోలేదంటే ఆశ్చర్యం వేస్తుంది. ఈయనకు పురందేశ్వరికి మధ్య సైద్ధాంతిక వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాజమండ్రిని వదులుకునే పరిస్థితి వస్తుందన్నది చిన్నమ్మ గురించి జరుగుతున్న టాక్. మరి ఏం జరుగుతుందో చూడాలి.