వాంగ్ చుక్ హాట్ కామెంట్స్... జైలు నుంచి కీలక సందేశం!
ఈ సమయంలో... లద్దాఖ్ కు రాష్ట్ర హోదాతో పాటు ఆక్కడి యువత కోసం కొన్ని డిమాండ్లతో ఆందోళనలు జరుగుతున్న వేళ, జైల్లో ఉన్న వాంగ్ చుక్ నుంచి కీలక సందేశం విడుదలయ్యింది.;
లద్దాఖ్ కు రాష్ట్ర ప్రతిపత్తి కల్పించడంతోపాటు అక్కడ ప్రజాస్వామ్య వ్యవస్థల్ని పునరుద్ధరించాలంటూ ఉద్యమం సాగిస్తున్న సోనమ్ వాంగ్ చుక్ వ్యవహారం ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో... లద్దాఖ్ కు రాష్ట్ర హోదాతో పాటు ఆక్కడి యువత కోసం కొన్ని డిమాండ్లతో ఆందోళనలు జరుగుతున్న వేళ, జైల్లో ఉన్న వాంగ్ చుక్ నుంచి కీలక సందేశం విడుదలయ్యింది.
అవును... లద్దాఖ్ కు రాష్ట్ర హోదా డిమాండ్ చేస్తూ ఇటీవల లేహ్ ప్రాంతంలో హింసాత్మక అల్లర్లు జరిగిన సంగతి తెలిసిందే. ఈ అల్లర్లలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. 90 మందికి పైగా గాయపడ్డారు. ఈ సమయంలో... సోనమ్ వాంగ్ చుక్ పిలుపుతోనే ఈ ఆందోళనలు జరిగాయని కేంద్రం వెల్లడించింది. అనంతరం పోలీసులు ఆయనను జాతీయ భద్రత చట్టం కింద అరెస్టు చేశారు.
ఈ క్రమంలో ప్రస్తుతం వాంగ్ చుక్ జోధ్ పుర్ సెంట్రల్ జైలులో ఉన్నారు. తాజాగా.. ఆయన సోదరుడు కాత్సేతాన్ డోర్జే లేతో పాటు న్యాయవాది ముస్తఫా హాజీలు ఆయన్ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఒక సందేశాన్ని పంపారు. ఇందులో భాగంగా... ఘర్షణల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోవడంపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని, లేదంటే తాను జైలులోనే ఉండిపోయేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు.
ఈ సందర్భంగా... తాను శారీరకంగా, మానసికంగా బాగానే ఉన్నానని చెప్పిన వాంగ్ చుక్.. తన కోసం ప్రార్థిస్తున్న వారందరికీ ధన్యవాదాలు అని తెలిపారు. ఇక.. ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేసిన ఆయన.. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సమయంలోనే.. నలుగురు వ్యక్తుల హత్యలకు సంబంధించి స్వతంత్ర న్యాయ విచారణ జరగాలని అన్నారు.
అలాకానిపక్షంలో.. తాను జైలులోనే ఉండేందుకు సిద్ధంగా ఉన్నానని.. లద్దాఖ్ కు రాష్ట్ర హోదా కోసం ప్రజలు, లేహ్ అపెక్స్ బాడీ(ఎల్.ఏ.బీ), కార్గిల్ డెమొక్రటిక్ అలయెన్స్ (ఏ.డీ.ఏ) చేస్తున్న డిమాండ్ లకు తాను సంపూర్ణ మద్దతు ఇస్తున్నానని వాంగ్ చుక్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా శాంతి, ఐక్యతను కాపాడుకోవాలని.. అహింసా మార్గంలోనే పోరాటాన్ని కొనసాగించాలని ప్రజలకు సూచించారు.
మరోవైపు ఆయనను పోలీసులు జాతీయ భద్రత చట్టం కింద అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇలా అరెస్టయిన వ్యక్తిని విచారణ చేయకుండా 12 నెలల పాటు నిర్బంధించేందుకు చట్టం అనుమతిస్తుంది. ఈ నేపథ్యంలో... తన భర్తను విడుదల చేయాలంటూ వాంగ్ చుక్ భార్య గీతాంజలి జే ఆంగ్మో.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై సోమవారం విచారణ జరగనుంది.
కాగా ఇటీవల లద్దాఖ్ డీజీపీ ఎస్.డి.సింగ్ జామ్వల్ స్పందిస్తూ... ఈ నిరసనల్ని ఒక పాకిస్థానీ గూఢచారి తమ దేశంతో పంచుకున్న నేపథ్యంలో వాంగ్ చుక్ కు పాకిస్థాన్ తో సంబంధాలున్నాయా అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నామని వెల్లడించారు. నాడు తాము కాల్పులు జరపకపోతే లద్దాఖ్ యావత్తూ కాలి బూడిదయ్యేదని చెప్పారు.