తిరుమలలో మంత్రి రోజాకు ఊహించని షాక్‌!

తిరుపతికి సమీపంలోనే తన నియోజకవర్గం నగరి ఉండటంతో తరచూ ఆమె తిరుమల శ్రీవారిని దర్శనానికి వస్తుంటారు.

Update: 2024-02-02 08:14 GMT

ఆంధ్రప్రదేశ్‌ లో ప్రతిపక్ష పార్టీల నేతలపై గట్టి వాగ్ధాటితో తీవ్ర విమర్శలు చేసేవారిలో మంత్రి రోజా ఒకరు. ప్రస్తుతం వైఎస్‌ జగన్‌ కేబినెట్‌ లో ఆమె పర్యాటక, క్రీడలు, సాంస్కృతిక శాఖల మంత్రిగా ఉన్నారు. తిరుపతికి సమీపంలోనే తన నియోజకవర్గం నగరి ఉండటంతో తరచూ ఆమె తిరుమల శ్రీవారిని దర్శనానికి వస్తుంటారు.

ఈ నేపథ్యంలో తాజాగా తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన మంత్రి రోజాకు ఊహించని షాక్‌ ఎదురైంది. స్వామివారిని దర్శించుకోవడానికి రోజా.. తిరుమలకు రాగా అనుకోని సంఘటన చోటు చేసుకుంది.

స్వామి వారి దర్శనం చేసుకొని ఆలయం వెలుపలకు వచ్చిన రోజా వద్దకు వచ్చిన కొందరు మహిళలు తమ ఫోన్లలో ఆమెను ఫొటోలు తీసుకోవడానికి ప్రయత్నించారు. దీంతో రోజా కూడా శ్రీవారి సేవకుల దుస్తుల్లో ఉన్న మహిళలను చూసి ఆగారు. రోజాతో ఫొటో కోసం అన్నట్టుగా మహిళంతా ఆమె చుట్టూ చేరారు.

ఇంతలో ఆ మహిళల్లో కొంతమంది ‘‘జై అమరావతి’’ అంటూ బిగ్గరగా నినాదాలు చేశారు. అంతేకాకుండా ‘జై అమరావతి.. చెప్పండి మేడమ్‌’ అని వారు మంత్రిని రోజాను కోరారు. ఈ ఘటనతో అవాక్కైన మంత్రి రోజా.. అక్కడ నుంచి వడివడిగా వెళ్లిపోయారు.

Read more!

కాగా రాజధాని అమరావతి ప్రాంతానికి చెందిన కొంతమంది మహిళలు శ్రీవారి సేవకు వచ్చారని తెలుస్తోంది. వారే రోజాను చూడగానే జై అమరావతి నినాదాలు చేశారని అంటున్నారు.

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులను ప్రకటించిన సంగతి తెలిసిందే. కార్వనిర్వాహక రాజధానిగా విశాఖపట్నాన్ని ప్రకటించారు. విశాఖకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపుకు సిద్ధమయ్యారు. అయితే ఈ వ్యవహారంపై హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలు కావడంతో స్పందించిన హైకోర్టు మూడు రాజధానుల జీవోలను కొట్టేసింది. ఈ తీర్పుపై స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఏపీ ప్రభుత్వానికి నిరాశే ఎదురైంది.

ఈ నేపథ్యంలో అమరావతి ప్రాంత రైతులు తమ నిరసనను వ్యక్తం చేస్తూ వస్తున్నారు. గతంలో అమరావతి నుంచి అరసవల్లి వరకు, న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు అంటూ రైతులు పాదయాత్రలు కూడా చేపట్టారు. తాజాగా తిరుమలలో జై అమరావతి నినాదాలతో రోజాకు షాకిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.

4

Tags:    

Similar News